విభజనలో దూరమై 75 ఏళ్ల తర్వాత కలిసిన సోదరులు

ABN , First Publish Date - 2022-01-13T01:11:12+05:30 IST

కారణాంతరాల వల్ల వ్యక్తులు విడిపోయినా విధి వారిని మళ్లీ కలిపితే ఆ ఆనందం..

విభజనలో దూరమై 75 ఏళ్ల తర్వాత కలిసిన సోదరులు

న్యూఢిల్లీ: కారణాంతరాల వల్ల వ్యక్తులు విడిపోయినా విధి వారిని మళ్లీ కలిపితే ఆ ఆనందం వర్ణనాతీతం. ఎప్పుడో దేశ విభజన సమయంలో విడిపోయిన సోదరుల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ ఇద్దరినీ సోషల్ మీడియా కలిపింది. ఇక ఆ సోదరుల ఆనందానికి హద్దులే లేవు. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ వృద్ధ సోదరులను చూసి వారి కుటుంబ సభ్యుల కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. సోదరుల కలయిక  కర్తార్‌పూర్ కారిడార్ సాక్షిగా జరిగింది.


మహమ్మద్ సిద్ధిఖి, మహమ్మద్ హబీబ్‌ సోదరులు 1947లో దేశ విభజన సమయంలో దూరమయ్యారు. పాకిస్థాన్‌‌లోని ఫైసలాబాద్‌లో సిద్ధిఖి స్థిరపడగా, హబీబ్ ఇండియాలోని పంజాబ్‌ రాష్ట్రంలో స్థిరపడ్డాడు. వీరి బంధువులు సోషల్ మీడియా సాయంతో ఇద్దరి ఆచూకీని తెలుసుకున్నారు. కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఒకరినొకరు కలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయం రానే రావడంతో.. సోదరులిద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనందంతో కౌగిలించుకుని ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఇన్నేళ్లూ ఇండియాలో ఉంటూ తాను పెళ్లి చేసుకోలేదని, తల్లి జ్ఞాపకశక్తి కోల్పోయి కన్నుమూసిందని హబీబ్ తన సోదరుడితో చెబుతూ కంటతడిపెట్టాడు. ఈ అపూర్వ సోదరుల ఉద్విగ్న క్షణాలను చూసి వారి బంధువుల కళ్లు చెమ్మగిల్లాయి.

Updated Date - 2022-01-13T01:11:12+05:30 IST