రూ.4.23 లక్షల కోట్లు ఆవిరి
ABN , First Publish Date - 2020-09-22T06:13:23+05:30 IST
ప్రపంచ మార్కెట్లతోపాటు దేశీ స్టాక్ సూచీలూ భారీ నష్టాల్లో పయనించాయి. బీఎ్సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ సోమవారం నాడు 811.68 పాయింట్లు కోల్పోయి 38,034.14 వద్దకు పతనమైంది...
- సెన్సెక్స్ 812 పాయింట్లు పతనం
- చితికిపోయిన చిన్న షేర్లు
ముంబై: ప్రపంచ మార్కెట్లతోపాటు దేశీ స్టాక్ సూచీలూ భారీ నష్టాల్లో పయనించాయి. బీఎ్సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ సోమవారం నాడు 811.68 పాయింట్లు కోల్పోయి 38,034.14 వద్దకు పతనమైంది. ఎన్ఎ్సఈ నిఫ్టీ 282.75 పాయింట్లు నష్టపోయి 11,222.20 వద్ద స్థిరపడింది. బ్లూచి్పలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మరింత అధికంగా కన్పించింది. దాంతో బీఎ్సఈ స్మాల్క్యాప్ సూచీ 3.61 శాతం, మిడ్క్యాప్ ఇండెక్స్ 3.43 శాతం క్షీణించాయి. బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4.23 లక్షల కోట్లు పతనమై రూ.1,54,76,979.16 కోట్లకు పడిపోయింది.
సెన్సెక్స్ కంపెనీల్లో 27 నష్టాల్లోనే..
సెన్సెక్స్లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 27 నష్టాల్లో ముగిశాయి. ఇండ్సఇండ్ బ్యాంక్ 8.67 శాతం క్షీణతతో టాప్ లూజర్గా నిలిచింది. భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సైతం భారీగానే నష్టపోయాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.
నష్టాలకు కారణాలివీ..
- యూరప్ దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో మరో విడత లాక్డౌన్ విధించవచ్చన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెంచాయి.
- కరోనా కేసుల కట్టడికి డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్ ఇప్పటికే పలు ఆంక్షలు విధించాయి. బ్రిటన్ మరో దఫా లాక్డౌన్ ఆలోచనలో ఉందన్న వార్తలు ఆందోళనలు పెంచాయి.
- దేశీయంగా కరోనా కేసులు పెరగుతుండటం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
- అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ (ఫిన్సెన్) అప్రమత్తం చేసిన మనీలాండరింగ్, టెర్రరిజం, డ్రగ్ డీలింగ్, ఆర్థిక మోసాలకు సంబంధించిన లావాదేవీల్లో కొన్ని భారతీయ బ్యాంక్ల ద్వారానూ జరిగినట్లు వార్తలు రావడంతో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
- ఈనెల 24తో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) సెప్టెంబరు సిరీస్ కాంట్రాక్టుల కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటమూ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
- గడిచిన కొన్ని రోజుల్లో రికార్డు ర్యాలీ తీసిన చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. బీఎ్సఈలో ఈ సెగ్మెంట్ సూచీలు 3 శాతం పైన క్షీణించాయి.