మహా పతనం
ABN , First Publish Date - 2021-04-13T07:10:15+05:30 IST
వైరస్ విలయం దలాల్ స్ట్రీట్లోనూ కల్లోలం సృష్టించింది. కొవిడ్ 2.0 ఉగ్రరూపానికి స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి కుప్పకూలాయి
- కరోనా దెబ్బకు సూచీలు క్రాష్
- సెన్సెక్స్ 1,708 పాయింట్లు డౌన్
- నిఫ్టీ 524 పాయింట్లు పతనం
- 2021లో రెండో అతిపెద్ద క్షీణత
- రూ.8.77 లక్షల కోట్లు హాంఫట్
ముంబై: వైరస్ విలయం దలాల్ స్ట్రీట్లోనూ కల్లోలం సృష్టించింది. కొవిడ్ 2.0 ఉగ్రరూపానికి స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి కుప్పకూలాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎ్సఈ సెన్సెక్స్ 1,707.94 పాయింట్లు పతనమై 47,883.38 వద్దకు పడిపోయింది. ఎన్ఎ్సఈ నిఫ్టీ 524.05 పాయింట్లు కోల్పోయి 14,310.80 వద్దకు జారుకుంది. ఈ ఏడాదిలో ప్రామాణిక ఈక్విటీ సూచీలకు రెండో అతిపెద్ద పతనమిది. బ్లూచి్పలతో పాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించడంతో బీఎ్సఈలోని అన్ని విభాగాల, రంగాల సూచీలు నేలచూపులే చూశాయి. తత్ఫలితంగా రూ.8.77 లక్షల కోట్ల మార్కెట్ సంపద గల్లంతైంది. దాంతో బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.200.85 లక్షల కోట్లకు పడిపోయింది.
డాక్టర్ రెడ్డీస్.. ఏకైక గెయినర్
సెన్సెక్స్లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 29 నష్టాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో కంపెనీల షేర్లు అత్యధిక క్షీణతను మూటగట్టుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్ మాత్రం 4.83 శాతం లాభంతో సూచీ ఏకైక గెయినర్గా నిలిచింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్లో అనుమతులు లభించడం.. మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ఈ వ్యాక్సిన్ ప్రధాన తయారీదారు కావడం షేరు పెరుగుదలకు దోహదపడింది.
సెన్సెక్స్ టాప్-5 లూజర్స్
కంపెనీ షేరు క్షీణత(%)
ఇండ్సఇండ్ బ్యాంక్ 8.60
బజాజ్ ఫైనాన్స్ 7.39
ఎస్బీఐ 6.87
ఓఎన్జీసీ 5.54
టైటాన్ 5.24
ఈ ఏడాదిలో సెన్సెక్స్ ఐదు అతిపెద్ద పతనాలు
తేదీ పాయింట్ల నష్టం
ఫిబ్రవరి 26 1,939.32
ఏప్రిల్ 12 1,707.94
ఫిబ్రవరి 22 1,145.44
జనవరి 27 937.66
మార్చి 24 871.13
ప్రధాన సూచీల నష్టం(%)
బీఎ్సఈ సెన్సెక్స్ 3.44
ఎన్ఎ్సఈ నిఫ్టీ 3.53
బీఎ్సఈ స్మాల్క్యాప్ 4.81
బీఎ్సఈ మిడ్క్యాప్ 5.32
బీఎ్సఈలో ప్రధాన రంగాల సూచీల నష్టం(%)
రియల్టీ 7.70
మెటల్ 5.65
ఆటో 5.15
పవర్ 5.07
ఫైనాన్స్ 5.00
బ్యాంకింగ్ 4.90
క్యాపిటల్ గూడ్స్ 4.66
టెలికాం 4.56
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 4.48
ఆయిల్ అండ్ గ్యాస్ 4.42
టెక్నాలజీ 2.53
ఐటీ 2.19
భారీ నష్టాలకు కారణాలు
కొవిడ్ 2.0 తీవ్రత
దేశంలో కరోనా రెండో విడత తీవ్రత అంచనాలను మించింది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 1.60 లక్షలకు చేరుకుంది. మరణాల రేటూ క్రమంగా పెరుగుతోంది. తొలుత మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలోనే అధిక కేసులు నమోదు కాగా, ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. దీంతో గత ఏడాది పరిస్థితులు పునరావృతం కావచ్చన్న భయాలు మార్కెట్లలో పెరిగాయి.
పూర్తి లాక్డౌన్ భయాలు
మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మినీ లాక్డౌన్లు అమలవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు పెంచాయి. దీం తో ఆర్థిక వృద్ధి పునరుద్ధరణపై ఇప్పటికే అనిశ్చితి మబ్బులు కమ్ముకున్నాయి. ఇందుకు తోడు మహారాష్ట్రలో 1-2 వారాల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నారన్న వార్తలతో మార్కెట్ వర్గాల్లో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో మార్కెట్లు పతన బాటపట్టాయి.
విదేశీ పెట్టుబడులు వెనక్కి
దేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించడ మూ ఈక్విటీ మార్కె ట్లో నష్టాలకు కారణమైంది. భారత వృద్ధి రికవరీపై నీలినీడలు కమ్ముకోవడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ పరిణామం ఈక్విటీలతో పాటు రూపాయి నష్టానికీ కారణమైంది.
రూ‘పాయే’!
వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయిన రూపాయి మరింత బక్కచిక్కింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్-రూపాయి మారకం రేటు మరో 32 పైసలు బలహీనపడి 75.05 స్థాయికి చేరుకుంది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, కరోనా కేసుల ఉధృతి రుపీ క్షీణతకు ప్రధాన కారణమయ్యాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సులభతర ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ దీర్ఘకాలంపాటు కొనసాగించాల్సి రావచ్చన్న అంచనాలూ రూపాయి విలువ పతనమవుతుండటానికి మరో కారణం.
నిఫ్టీ 14,250 మద్దతు స్థాయిని కోల్పోతే, సూచీ మరింత పతనమై 13,800 -13,900కు పడిపోయే అవకాశం ఉంది.
- మనీశ్ హతిరామణి, అనలిస్ట్, దీన్దయాళ్ ఇన్వె్స్టమెంట్స్
జీడీపీ వృద్ధి, కార్పొరేట్ కంపెనీల పనితీరుపై మార్కెట్ వర్గాల్లో నెలకొన్న అంచనాలకు కరోనా ఉధృతి తీవ్రంగా గండికొట్టనుంది.
- వీకే విజయ్కుమార్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్