అమెరికా కొత్త ప్రభుత్వంపై ఆశలు.. దేశీయ మార్కెట్లు పైపైకి..!

ABN , First Publish Date - 2021-01-20T23:04:38+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ఐటీ, ఇంధన, ఆటో స్టాక్‌లు లాభాలు నమోదు చేయడంతో బీఎస్ఈ...

అమెరికా కొత్త ప్రభుత్వంపై ఆశలు.. దేశీయ మార్కెట్లు పైపైకి..!

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ఐటీ, ఇంధన, ఆటో స్టాక్‌లు లాభాలు నమోదు చేయడంతో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు ఎగబాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 120 పాయింట్లకు పైగా బలపడింది. అమెరికాలో వస్తున్న కొత్త ప్రభుత్వం తాజా ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నెలకొంది. ఇది దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 393.83 పాయింట్లు (0.80 శాతం) బలపడి 49,792.12 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 123.55 పాయింట్లు (0.85 శాతం) ఎగసి 14,644.70 వద్ద క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్‌లో మారుతి అత్యధికంగా 2.75 శాతం మేర బలపడగా... టెక్ మహీంద్రా, మహింద్రా అండ్ మహింద్రా, ఏసియన్ పెయింట్స్ తదితర షేర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటితోపాటు రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు కూడా లాభాల్లో కొనసాగడంతో వరుసగా రెండోరోజు దేశీయ మార్కెట్లు రికార్డు స్థాయిని తాకాయి. 

Updated Date - 2021-01-20T23:04:38+05:30 IST