నోట్ల రద్దు తర్వాత రూ.2.11 లక్షలు డిపాజిట్ చేసిన గృహిణి.. కేసులో సంచలన తీర్పు..

ABN , First Publish Date - 2021-06-24T17:56:51+05:30 IST

నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. నల్లధనాన్ని వెలికి తీయడానికి అక్రమార్కులపై ఈ మాస్టర్ స్ట్రోక్‌ను ప్రయోగించామని ఏకంగా ప్రధాని మోదీ అప్పట్లో చెప్పుకొచ్చారు

నోట్ల రద్దు తర్వాత రూ.2.11 లక్షలు డిపాజిట్ చేసిన గృహిణి.. కేసులో సంచలన తీర్పు..

నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. నల్లధనాన్ని వెలికి తీయడానికి అక్రమార్కులపై ఈ మాస్టర్ స్ట్రోక్‌ను ప్రయోగించామని ఏకంగా ప్రధాని మోదీ అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఎన్ని కష్టాలు పడుతున్నా.. ప్రజలు మాత్రం కేంద్రానికి సహకరించారు. అయితే ఈ క్రమంలోనే పలు ఊహించని సంఘటనలు జరిగాయి. మహిళలు పోపుల డబ్బాల్లో దాచుకునే డబ్బులు పనికి రాకుండా పోతాయన్న భయంతో బ్యాంకుల ముందుకు క్యూ కట్టాల్సి వచ్చింది. పెద్ద మొత్తంలో ఆ డబ్బు కనుక ఉంటే దానికి లెక్కలు సమర్పించాలని ఐటీ అధికారుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. అచ్చం ఇలాంటి ఇబ్బందినే ఓ గృహిణి ఎదుర్కొంది. బ్యాంకులో రెండు లక్షల రూపాయలకు పైగా డబ్బును డిపాజిట్ చేస్తే.. అధికారులు దానికి లెక్కలు అడిగారు. ఆమె చెప్పిన దానికి అధికారులు సంతృప్తి చెందలేదు. దానికి పన్ను చెల్లించాల్సిందేనని తేల్చారు. దీంతో ఆమె ఆదాయపు పన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. ఈ కేసులో పూర్తి విచారణ చేసిన ట్రిబ్యునల్ సంచలన తీర్పును ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఉమా అగర్వాల్ అనే గృహిణికి నోట్ల రద్దు వల్ల పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆమె 2016-2017వ ఆర్థిక సంవత్సరానికి గానూ లక్షా 30వేల 810 రూపాయలను తన ఆదాయంగా చూపించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను సమర్పించింది. అయితే 2016 నవంబర్ 8వ తారీఖున నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఆమె 2 లక్షల 11 వేల 500 రూపాయలను తన బ్యాంకులో డిపాజిట్ చేసింది. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆ డబ్బునకు లెక్కలు చెప్పాలని నోటీసులు పంపించారు. 


‘నా భర్త, పిల్లలు, బంధువులు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బును సొంతంగా దాచుకున్నా. ఆ డబ్బే ఇది. ఇది నా సంపాదన ద్వారా వచ్చిన డబ్బు కాదు. నా మేలు కోరిన వాళ్లు నాకు ఇచ్చిన డబ్బు.’ అని ఉమా అగర్వాల్ వివరణ ఇచ్చింది. ఆమె వివరణకు ఐటీ అధికారులు సంతృప్తి చెందలేదు. అంతే కాకుండా ఓ అధికారిని నియమించి ఈ కేసును విచారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమా అగర్వాల్ ఆగ్రాలోని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును పూర్తిగా విచారించిన ట్యిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు. ఈ డిపాజిట్‌కు ఎలాంటి విచారణ అవసరం లేదని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసులకు ఈ తీర్పు వర్తిస్తుందని కూడా తేల్చింది. 

Updated Date - 2021-06-24T17:56:51+05:30 IST