‘టెన్త్’ సమన్వయానికి సీనియర్ అధికారులు.. పరీక్షలు సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-05-14T17:50:47+05:30 IST
పదో తరగతి(Tenth grade) వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించారు. పరీక్షలు సవ్యంగా జరిగే విధంగా ఈ అధికారులు చర్యలు చేపడతారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు(School education officials) నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు...
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి(Tenth grade) వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించారు. పరీక్షలు సవ్యంగా జరిగే విధంగా ఈ అధికారులు చర్యలు చేపడతారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు(School education officials) నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగను న్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. సీనియర్ అధికారులు.. జిల్లా స్థాయిలోని అన్ని విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించి, అవసరమైన నిర్ణయాలను తీసుకుంటారు. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూలు, జోగులాంబ, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్లోని రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మిని నియమించారు. అలాగే.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో టీఆర్ఈఐఎస్ డైరెక్టర్ రమణ కుమార్, వికారాబాద్ జిల్లాలో జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి పరీక్షల సీనియర్ అధికారులుగా ఉంటారు. ఇక సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డిని; నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవిని నియమించారు. అలాగే.. ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాలకు వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి; మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు డైట్ ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి; హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ రాజీవ్ పరీక్షల అధికారులుగా వ్యవహరిస్తారు.
ఇంటర్ పరీక్షకు 95% విద్యార్థుల హాజరు
శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 95.1ు మంది విద్యార్థులు హాజరయ్యారు. మ్యాథ్ పేపర్-1, జీవశాస్త్రం పేపర్-1, చరిత్ర పేపర్-1 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 3,69,183 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 3,50,748 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మిగతా 18,435 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
పరీక్షల ఒత్తిడి ఉంటే.. కాల్ 18005999333
విద్యార్థులు పరీక్షల విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే టోల్ఫ్రీ నంబరు 18005999333 కు ఫోన్ చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. ఈ నంబర్ 24/7 అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చు. సైకాలజిస్టుల సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు స్టూడెంట్ కౌన్సెలర్లను నియమించినట్లు బోర్డు కార్యదర్శి తెలిపారు. కాగా.. శుక్రవారం జరిగిన మ్యాథ్స్ పేపర్-1 పరీక్షలో సెక్షన్-బిలోని 17, 18 ప్రశ్నలను పాఠ్య పుస్తకంలో ఉన్నవాటికి భిన్నంగా ఇచ్చారని కొంతమంది విద్యార్థులు తెలిపారు.
స్వచ్ఛ విద్యాలయ పుర స్కారానికి ప్రతిపాదనలు
పాఠశాలలకు కేంద్రం ఇచ్చే స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ప్రతిపాదనలను పంపించాల్సిందిగా విద్యాశాఖ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. ఈ నెల 22వ తేదీలోపు ఈ పురస్కారాలకు సంబంధించిన పాఠశాలల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను ఇస్తున్న విషయం తెలిసిందే.