పసుపు అమ్మేదెలా?

ABN , First Publish Date - 2020-06-05T10:32:12+05:30 IST

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రం మూన్నాళ్ల ముచ్చటగా మారింది.

పసుపు అమ్మేదెలా?

 మూన్నాళ్ల ముచ్చటగా కొనుగోలు కేంద్రం

 మూసివేతతో రైతుల ఆందోళన

 పునఃప్రారంభించాలని వినతి

 

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 4: వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గతనెల 22వ తేదీన ప్రారంభమైన కేంద్రం ఈనెల 1వ తేదీ నుంచి తలుపులు తెరుచుకోలేదు. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.4,500 పలుకుతోంది. అయితే కొనుగోలు కేంద్రంలో రూ.6850 మద్దతు ధర చెల్లిస్తుండడంతో పంటను ఎలా అమ్మాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు.


సబ్‌ డివిజన్‌ పరిధిలోని 171 మంది రైతులను గుర్తించి ఈ కర్షక్‌లో నమోదైన వారి నుంచే కొనుగోలు చేశారు. నిబంధనలు సాకుగా చూపిస్తూ నాణ్యత లేదని కొందరి నుంచి తిరస్కరించారు. సుమారు 5 వేల క్వింటాళ్ల దిగుబడి కొనుగోలు చేయాల్సి ఉండగా పట్టుమని ఐదురోజులు కూడా కొనుగోళ్లు జరగలేదు. సుమారు 850 క్వింటాళ్లు మాత్రమే సేకరించారు. మే 31వ తేదీ నాటికి గడువు ముగియడంతో కేంద్రాన్ని మూసివేశారు. టోకెన్లు ఇచ్చిన రైతులు పసుపు నిల్వలను తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. కేంద్రాన్ని పునఃప్రారంభించాలని కోరుతున్నా స్పందన లేదు.  


క్వాలిటీ అధికారులు వస్తే ప్రారంభిస్తాం... సుజాత, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

 పంట నాణ్యతను గుర్తించే క్వాలిటీ అధికారులు వస్తేనే ఉదయగిరిలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. వారు రాగానే ప్రారంభానికి చర్యలు తీసుకొంటాం. 

Updated Date - 2020-06-05T10:32:12+05:30 IST