నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌

ABN , First Publish Date - 2020-06-06T10:49:11+05:30 IST

నకిలీ విత్తనాలు, ఎరువులను అమాయక రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని చూసే ముఠాలపై ఉక్కుపాదం

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌

వ్యవసాయ, పోలీసు అధికారులతో సీపీ సజ్జనార్‌ సమీక్ష



హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలు, ఎరువులను అమాయక రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని చూసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. దేశానికి అన్నంపెట్టే రైతులను మోసం చేస్తే ఉపేక్షించబోమన్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా కేటుగాళ్ల ఆటకట్టించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


లా అండ్‌ ఆర్డర్‌, ఎస్‌వోటీ పోలీసులు, అగ్రికల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌(సీడ్స్‌) బాలు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయాలని, అనుమతి, లైసెన్స్‌ లేకుండా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్న వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలన్నారు. వ్యాపారులు సీడ్స్‌, అండ్‌ ఫెర్టిలైజర్స్‌ నిబంధనలకు లోబడి క్రయ విక్రయాలు చేయాలని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చేయాలని సూచించారు.


నకిలీ విత్తనాలు అమ్మే వారిపై క్రిమినల్‌ కేసులతోపాటు పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే సైబరాబాద్‌ పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444., డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, ఎ. వెంకటేశ్వరరావు, పద్మజ, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌, ఎస్బీ ఏడీసీపీ గౌస్‌ మొయినొద్దీన్‌, ఏసీపీ రవీందర్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వ్యవసాయాధికారులు ఎస్‌. గీత, మేరీ, రేఖ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T10:49:11+05:30 IST