ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ABN , First Publish Date - 2021-10-18T04:49:28+05:30 IST
సరదాగా షికారు కోసమని తెప్పపై చెరువు మధ్యలోకి వెళ్లిన ముగ్గురుయువకులు సెల్ఫీ తీసుకుంటున్న సమయలోఓ ఆ తెప్ప బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో ఆదివారం సాయంత్రం జరిగింది.
షికారు కోసం నాటుపడవపై చెరువులోకి
పడవ బోల్తా పడి యువకుడి మృతి.. మరో ఇద్దరు క్షేమం
ఖమ్మం జిల్లా తనికెళ్లలో ఘటన
కొణిజర్ల, అక్టోబరు 17: సరదాగా షికారు కోసమని తెప్పపై చెరువు మధ్యలోకి వెళ్లిన ముగ్గురుయువకులు సెల్ఫీ తీసుకుంటున్న సమయలోఓ ఆ తెప్ప బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనికెళ్లకు చెందిన బత్తుల వెంకటకృష్ణ (19), మరో ఇద్దరు యువకులు చల్లా వీరన్న, రవీందర్తో కలిసి గ్రామ సమీపంలోని నరసింహుల చెరువులోకి తెప్పపై షికారు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తెప్పపై ఉండి సెల్ఫీలు దిగుతుండగా అది తిరగపడింది. దీంతో ఆ ముగ్గురు యువకులు నీటిలో పడిపోగా.. ఈత రాకపోవడంతో వెంకటకృష్ణ మునిగాడు. వీరన్న, రవీందర్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. వెంకటకృష్ణ కోసం ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. మృతదేహం లభ్యమైంది. మృతుడు వెంకటకృష్ణ తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.