గుర్తుపెట్టుకోండి: కరోనాకు అసలైన మందేంటో తెలుసా..
ABN , First Publish Date - 2021-05-13T05:16:03+05:30 IST
కరోనా బారినపడిన..
ఆత్మస్థైర్యమే అసలైన మందు
కరోనా గురించి అతిగా ఆందోళన చెందొద్దంటున్న వైద్యులు
వైరస్ బారినపడినా 99 శాతం మందికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు
ఒక శాతం మందికి మాత్రమే ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం
భయమే ప్రస్తుతం మరణాలు పెరగడానికి కారణం
వైరస్ గురించి ఎక్కువగా తీసుకోకపోవడం మంచింది
మానసిక ఆనందాన్ని కలిగించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరి
మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘ధైర్యం కేన్సర్ ఉన్నోడిని బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది’
అవును ప్రస్తుతం కరోనా అనే భయం... ఎంతోమందిని చంపేస్తోంది. కరోనా సోకుతుందేమోనన్న భయంతో కొందరు, సోకిన తరువాత ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో మరికొందరు, చికిత్సపొందుతూ ఇంకొందరు మృతిచెందుతున్నారు. వైరస్ బారినపడ్డామన్న భయం, ఆందోళన కారణంగా ఎక్కువ మందిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతోందని, పెరిగిన ఒత్తిడి శరీరంలోని ఇతర అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా బారినపడినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఉంటే.. కొద్దిరోజుల్లోనే పూర్తిగా కోలుకోవచ్చుననే విషయాన్ని ఎవరూ విస్మరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే...
99 శాతం మంది సేఫ్..
కరోనా బారినపడిన వంద మందిలో 99 శాతం మంది సురక్షితమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆస్పత్రులకు వెళ్లకుండా, ఇళ్ల వద్ద వుండి మందులు వాడుకోవడం ద్వారా చాలామంది కోలుకుంటున్నారు. మరో మూడు, నాలుగు శాతం మందికి కాస్త ఎక్కువ మందులు వినియోగించాల్సి వస్తున్నది. ఒకటి, రెండు శాతం మందికి మాత్రమే ఆక్సిజన్, వెంటిలేటర్స్, ఖరీదైన మందులు, ఇంజక్షన్లు వంటివి అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీరిలో అత్యధికులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉంటున్నారంటున్నారు. వైరస్ బారినపడిన వారిలో 99 శాతం మంది కోలుకుంటారన్న విషయాన్ని మరిచిపోయి అందరూ ఆందోళన చెందుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
మరణ శాసనమవుతున్న భయం
ప్రస్తుతం దేశంలో కరోనా మరణాలు పెరగడానికి ప్రధాన కారణం వైరస్ బాధితుల్లో పెరిగిన భయమే. ఉదాహరణకు...ఒక వ్యక్తిని పాము కరిచిందనుకోండి. వెనక్కి తిరిగి చూసేలోగా కాళ్ల మధ్య నుంచి ఒక తొండ వెళుతూ కనిపిస్తే...కరిచింది తొండే కదా అన్న ధీమాతో ఆ వ్యక్తి నిశ్చితంగా ఇంటికి వెళ్లిపోతాడు. ఆ పక్కన పనిచేస్తున్న ఇంకో వ్యక్తిని తొండ కరిచిందనుకోండి. కానీ, పక్కనే పాము కనిపిస్తే...తనను పామే కరిచిందన్న ఆందోళనతో అక్కడికక్కడే మృత్యువాతపడతాడు. దేశంలో పాము కాటు వల్ల సంభవించే ప్రతి వంద మరణాల్లో 99 ఇలానే ఉంటున్నాయని, అలాగే ప్రస్తుతం కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య కంటే...కరోనా సోకిందన్న భయం, ఆందోళన, ఒత్తిడితో చనిపోయే వారి సంఖ్య అధికంగా వుందని వైద్యులు పేర్కొంటున్నారు.
మానసిక స్థైర్యమే మందు..
కరోనా వైరస్ బారినపడినప్పటికీ..మానసిక స్థైర్యంతో వుంటే వేగంగా కోలుకునేందుకు అవకాశముంది. ఒకసారి భయం మొదలైతే శారీరకంగా, మానసికంగా కుంగిపోతారు. దీంతో వ్యాధి నిరోధకశక్తి క్షీణిస్తుంది. దీనివల్ల వైరస్ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై ఎక్కువగా చూపిస్తుంది. అదే ధైర్యంతో ఉంటే...వ్యాధి నిరోధక శక్తి..శరీరంలోకి వచ్చిన వైరస్పై పోరాటాన్ని సాగించి త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఉదాహరణకు..క్లినికల్స్ ట్రయల్స్ నిర్వహించినప్పుడు వంద మందిని తీసుకుంటే..వారిలో 50 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. 50 మందికి వ్యాక్సిన్ లేని ఇంజక్షన్ ఇస్తారు. కొద్దిరోజులు తరువాత ఈ వంద మందిని పరీక్షించినప్పుడు 80-85 మందిలో యాంటీ బాడీస్ అభివృద్ధి చెందుతాయి. వాస్తవంగా అయితే వ్యాక్సిన్ తీసుకున్న 50 మందిలో మాత్రమే యాంటీబాడీస్ అభివృద్ధి చెందాలి. కానీ, ఎక్కువ మందిలో అభివృద్ధి చెందడానికి..తాము వ్యాక్సిన్ తీసుకున్నామన్న భరోసా, సానుకూల దృక్పథమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అటువంటి ధైర్యం, సానుకూల దృక్పథం వైరస్ బారినపడిన ప్రతి ఒక్కరికీ కావాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సిన్తో రక్షణ
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించడంతోపాటు మాస్క్ ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంతోపాటు అవకాశం వున్న ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండు డోసులు తీసుకున్న వారికి 95 శాతం రక్షణ ఉంటుంది. ఒకవేళ వైరస్ సోకినా అంత తీవ్రత ఉండదు. ఇక, మొదటి డోసు తీసుకున్నా 60-70 శాతం సేఫ్ జోన్లో ఉన్నట్టే. వీరికి వైరస్ సోకినా మరణం సంభవించే పరిస్థితి వుండదని నిపుణులు చెబుతున్నారు.
ఏడు రోజులు జ్వరముంటే..
సీజన్ మారిన ప్రతిసారి జలుబు, దగ్గు, జ్వరం వంటివి వేధించడం సర్వసాధారణం, కరో నా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సాధారణ జలుబు, జ్వరం వచ్చినా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అటువంటి భయాలు అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వారం రోజులు కంటే ఎక్కువగా ఉండి, ఒక లక్షణం తరువాత మరో లక్షణం పెరుగుతుంటే కరోనా అని అనుమానించాలి. ముఖ్యంగా ఆయాసం వస్తే మాత్రం వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యులు సలహా మేరకు మందులు వాడాలి.
దూరంగా ఉండాలి..
కరోనా వల్ల చనిపోయిన, కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చేరి ఇబ్బందులు పడుతున్న వారి గురించి తెలుసుకోవడం మంచిది కాదు. ఇది మరింత ఆందోళనకు గురిచేస్తుంది. వీలైనంత వరకు మానసిక, శారీరక ఆనందాన్ని కలిగించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, యోగా, వ్యాయామం వంటివి చేయడం మంచిది.
భయపెట్టొద్దు..
వైరస్ బారినపడిన వ్యక్తులకు కుటుంబ సభ్యులు, స్నేహితులు భరోసా కల్పించే మాటలు చెప్పాలి. భయాన్ని పురిగొల్పేలా వారితో వ్యవహరించొద్దు. వీలైనన్నిసార్లు కరోనా బాధితు లతో మాట్లాడడం వల్ల వారిలో ఉత్సాహాన్ని కలిగించేందుకు అవకాశముంది.
మరికొద్దిరోజులు అప్రమత్తంగా..
మరో రెండు వారాలపాటు అప్రమత్తంగా వుండడం ద్వారా వైరస్ బారినపడకుండా వుండేందుకు అవకాశముంది. కేసులు తగ్గుముఖం పడితే చాలావరకు ప్రస్తుతమున్న ఎన్నో రకాల ఇబ్బందులకు చెక్ చెప్పవచ్చు. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో లాక్డౌన్ పెట్ట డం కొంత ఆలస్యమైంది. కొద్దిరోజులు ముందు లాక్డౌన్ నిర్ణయం తీసుకుని వుంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది
అతి భయమే అనర్థాలకు కారణం
కరోనా కంటే..దానివల్ల ఏర్పడిన భయం వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. కరోనా గురించి అవగాహన పెంచుకోవడానికి బదులుగా...భయం పెరిగిపోవడానికి కారణమయ్యేంతగా.. ప్రజలు దాని గురించి తెలుసుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. కరోనా వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?, లక్షణాలు ఏమిటి?...అన్న విషయాలు తెలుసుకుంటే చాలు. కరోనాతో ఎందరు చనిపోతున్నారు, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్న విషయాలను తెలుసుకోవడం ద్వారా మన మైండ్ దాని గురించే ఎక్కువ ఆలోచించి.. మానసికంగా కరోనా అనే ఫోబియాకు అలవాటు పడిపోతోంది. ఇది అత్యంత ఇబ్బందికరంగా మారే అవకాశముంది. ప్రస్తుతం భయంతోనే చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వైరస్ సోకిందని తెలియగానే కొందరు చనిపోతున్నారు. కరోనా సోకినా ఏమీ కాదన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలి.
- డాక్టర్ సోమయాజులు, ప్రముఖ వైద్య నిపుణులు
ధైర్యంగా మహమ్మారిని ఎదుర్కొని బయటపడదాం
కరోనా సోకిందన్న విషయం తెలియగానే చాలామంది తీవ్రమైన భయాందోళన చెందుతూ ఒత్తిడికి గురవుతున్నారు. ఇది హార్ట్ ఫెయిల్యూర్కు కారణమవుతోంది. గుండె దడ పెరిగి కార్డియోమయోపతి బారినపడినట్టు జపాన్లో నిర్ధారణ అయింది. ఈ తరహా కేసులను స్వయంగా చూశాను. అటువంటి వారిని వెంటనే గుర్తించి వైద్య సేవలు అందిస్తే పర్వాలేదు. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది. ప్రస్తుతం కరోనా వల్ల ఎంతోమంది హార్ట్ ఫెయిల్యూర్ బారినపడుతున్నారు. మరికొందరు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. కరోనా వైరస్ వల్ల మనిషికి ఏమీ జరగడం లేదు. వైరస్ సోకిందన్న భయం వల్ల శరీరంలోని అనేక అవయవాలపై ఒత్తిడి పెరిగి ఫెయిలై మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి, ధైర్యంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొని బయటపడదాం.
- వై.జ్ఞానసుందరరాజు, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, కేజీహెచ్