‘తానా’ మెచ్చే..!
ABN , First Publish Date - 2022-05-26T04:29:17+05:30 IST
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదికల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలకు పట్టణంలోని డీఎన్ఆర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని కామంచి శారద రాసిన గేయం ఎంపికైంది.
అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఉపాధ్యాయిని శారద ఎంపిక
పొదలకూరు, మే 25 : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదికల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలకు పట్టణంలోని డీఎన్ఆర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని కామంచి శారద రాసిన గేయం ఎంపికైంది. ఈనెల 29వ తేదీలలో జూమ్ వేదిక ద్వారా తానా నిర్వహించబోతున్న ప్రపంచ స్థాయి కవిత పోటీలో ఆమె గురువు గొప్పతనాన్ని వివరిస్తూ రచన చేసిన ‘గురువుకు మించి అర్థం ఉన్నదా! విద్యకు మించిన ధనం ఉన్నదా!’ అనే గేయం వినిపించనున్నారు. గతంలో కామంచి శారద ఉత్తమ మహిళ ఉపాధ్యాయిని, మదర్థెరిస్సా, జ్యోతిబాపూలే, సేవారత్న, సాహిత్యరత్న, మొదలైన పురస్కారాలు అందుకున్నారు. జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నెల్లూరు పద్మావతి సెంటర్కి చెందిన కామంచి శారదని పాఠశాల ప్రధానోపాఽధ్యాయుడు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు, సాహితీ వేత్తలు ప్రశంసించారు.