పల్లికొండేశ్వరాలయంలో విభేదాల సెగ
ABN , First Publish Date - 2021-07-28T06:22:01+05:30 IST
నాగలాపురం మండల పరిధిలో ఉన్న సురుటుపల్లి పల్లికొండేశ్వర దేవాలయంలో మంగళవారం ఉత్కంఠను రేకెత్తించే సంఘటనలు వేడి పుట్టించాయి.
చైర్మన్ అవినీతిపై ధర్మకర్తల ఫిర్యాదు
విచారణ జరిపిన దేవదాయశాఖ సహాయ కమిషనర్
అత్యవసర సమావేశంలో నూతన చైర్మన్గా పార్థసారథి ఎన్నిక:ఈవో
చట్ట ప్రకారం చెల్లదు.. నేనే చైర్మన్ : ఏవీఎం మునిశేఖర్ రెడ్డి
నాగలాపురం, జూలై 27: నాగలాపురం మండల పరిధిలో ఉన్న సురుటుపల్లి పల్లికొండేశ్వర దేవాలయంలో మంగళవారం ఉత్కంఠను రేకెత్తించే సంఘటనలు వేడి పుట్టించాయి. ఆలయ బోర్డు చైర్మన్ మునిశేఖర్ రెడ్డి, బోర్డు సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం నెలకుంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం దేవదాయశాఖ అనుమతి లేకుండా చైర్మన్ ఆలయ ప్రాకారంలో కట్టడాలు నిర్మిస్తున్నారంటూ ధర్మకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మంగళవారం దేవదాయశాఖ సహాయ కమిషనర్ ఏకాంబరం పల్లికొండేశ్వర ఆలయంలో సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి విచారణ జరిపారు. చైర్మన్పై ఉన్న అభియోగాలను రాత పూర్వకంగా తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆరోపణలపై చైర్మన్ ఏవీఎం మునిశేఖర్రెడ్డి నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం చైర్మన్, దేవదాయశాఖ సహాయ కమిషనర్ ఇద్దరు ఆలయం నుంచి వెళ్లిపోయారు. తదనంతరం ఆలయ ఈవో రవీంద్రరాజు ఈ ఏడాది మార్చిలో చైర్మన్ ఏవీఎం మునిశేఖర్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం గురించి 8మంది సభ్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్గా ఏవీఎం మునిశేఖర్ రెడ్డిని తొలగిస్తున్నట్లు 8మంది ఆమోదించినట్లు ప్రకటించారు. దీంతో నూతన చైర్మన్గా పార్థసారథిని ఎన్నికయ్యారని ఓ ప్రకటన విడుదల చేశారు. మరో వైపు విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ చైర్మన్ ఏవీఎం మునిశేఖర్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
అసత్య ప్రచారం
తనపై ఈవో అసత్య ప్రచారం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే దేవదాయశాఖలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలాంటి ఎజెండా లేకుండా, చైర్మన్కు సమాచారం ఇవ్వకుండా, చైర్మన్, సంబంధిత ఉన్నతాధికారులు లేకుండా అవిశ్వాస తీర్మానం చర్చ జరిగే అవకాశమే లేదు. ఇలా నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటా. తన పరువుకు నష్టం కలిగించిన ఈవో రవీంద్రరాజుపై కోర్టులో పరువునష్టం దావా వేస్తా.
- చైర్మన్, ఏవీఎం మునిశేఖర్ రెడ్డి