దైవ క్షమను పొందాలంటే..
ABN , First Publish Date - 2021-06-04T05:30:00+05:30 IST
ఒకసారి ఏసు దగ్గరకు ఆయన అనుయాయుడైన పేతురు వచ్చి, ఒక ప్రశ్న వేశాడు. ‘‘ప్రభువా, నా పట్ల నా సోదరుడు పాపం చేస్తే నేను అతణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లా? అని అడిగాడు...
ఒకసారి ఏసు దగ్గరకు ఆయన అనుయాయుడైన పేతురు వచ్చి, ఒక ప్రశ్న వేశాడు. ‘‘ప్రభువా, నా పట్ల నా సోదరుడు పాపం చేస్తే నేను అతణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లా? అని అడిగాడు.
‘‘నేను నీకు చెబుతున్నాను. ఏడుసార్లు కాదు, డెబ్భై ఏడుసార్లు’’ అని ఏసు బదులిచ్చాడు.
ఆ సంఖ్యను ఏసు ప్రభువు ప్రతీకాత్మకంగా మాత్రమే తీసుకున్నాడు. క్షమించడం ఒకటి, రెండు పర్యాయాలకు పరిమితం కాదనీ, అది నిరంతరం అనుసరించాల్సిన మార్గమనీ ఆయన సూచించాడు. అంతేకాదు, ‘‘మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనస్ఫూర్తిగా క్షమించకపోతే, పరలోకంలో ఉన్న నా తండ్రి కూడా మీ విషయంలో అదే విధంగా వ్యవహరిస్తాడు’’ అని హెచ్చరించాడు.
ఏసు ప్రభువు జీవిత ఘట్టాల్లో, ఆయన చెప్పిన కథల్లో క్షమాగుణం ప్రాధాన్యాన్ని చాటే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మనిషిని ఉన్నతుడిగా చేసేదీ, ఆత్మను పరిశుద్ధం చేసేదీ క్షమ. మన పట్ల కఠినంగా ప్రవర్తించిన వారినీ, మనల్ని అగౌరవపరచినవారినీ, హాని చేసినవారినీ క్షమించాలని అనేక సందర్భాల్లో ఏసు చెప్పాడు. అలాగే పాపులను క్షమించడమే ప్రేమ మార్గమని బోధించాడు. తనను చంపబోయిన వారిని కూడా ఆయన క్షమించాడు. ‘‘ఇతరులు మీ పట్ల చేసిన తప్పులను మీరు మన్నిస్తే మీ తప్పులను దేవుడు క్షమిస్తాడు’’ అని స్పష్టం చేశాడు. క్షమాగుణానికి సహనం అవసరం. ఒక నాణేనికి ప్రేమ ఒక పార్శ్వం అయితే క్షమ మరొక పార్శ్వం. కాబట్టి అసహనాన్ని వీడాలి. మనసును ప్రేమమయం చేసుకోవాలి. ఆలోచనల్లో క్షమాగుణం నింపుకోవాలి. మానవులు తాము చేసిన పొరపాట్లకు దైవం నుంచి క్షమను పొందాలంటే అనుసరించాల్సిన దారి అదే!