సీడ్ వ్యాపారుల ఇష్టారాజ్యం
ABN , First Publish Date - 2021-11-30T05:22:39+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయవద్దని ప్రకటించడంతో సీడ్ వ్యాపారులకు గిరాకీ పెరిగింది.
- వరి వేయద్దని ప్రభుత్వం ప్రకటించడంతో పెరిగిన సీడ్ సాగు
- క్వింటాల్కు సన్న, దొడ్డు రకాలకు మద్దతు ధర కంటే తక్కువే
హుజూరాబాద్, నవంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయవద్దని ప్రకటించడంతో సీడ్ వ్యాపారులకు గిరాకీ పెరిగింది. దీంతో విత్తన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మద్దతు ధర కంటే వంద రూపాయలు అదనంగా ఇచ్చిన సీడ్ వ్యాపారులు ఇదే అదునుగా భావించి క్వింటాల్కు 300 రూపాయలు తక్కువ ఇస్తామంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు సీడ్ వ్యాపారులు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. గతంలో సన్న రకం సీడ్ ధాన్యానికి క్వింటాల్కు రెండు వేలు, దొడ్డు రకానికి 1,900 రూపాయలు చెల్లించారు. ప్రస్తుతం సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు 1,700, దొడ్డు రకానికి 1,600 రూపాయలు ఇస్తామని, అందీ రెండు నెలల వాయిదాల్లో డబ్బులు చెల్లిస్తామంటున్నారు. ఈ నిబంధనలకు ఒప్పుకుంటేనే సీడ్ ఇస్తామని రైతులకు చెబుతున్నారు. గతంలో పత్తి, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు సాగునీరు అందుబాటులోకి రావడంతో తమ భూములను పొలాలుగా మార్చుకున్నారు. చేసేది ఏం లేక రైతులు సీడ్ ధాన్యాన్ని తీసుకొని నారు పోస్తున్నారు. యాసంగిలో ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ఆయకట్టు కింద సీడ్కే రైతుల ప్రాధాన్యం
ప్రతి యాసంగిలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఎక్కువ శాతం సీడ్ ధాన్యానికి రైతులు ప్రాధాన్యం ఇస్తారు. ఈసారి సీడ్ కంపెనీలు కూడా ధాన్యం అమ్ముడు పోతదో లేదోనని ఏరియాను తగ్గించారు. సీడ్ వరి సాగుకు హుజూరాబాద్ డివిజన్ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని రైతులందరికి సీడ్ వరిపై మెళకువలు తెలుసు కాబట్టి సీడ్ను సాగు చేస్తారు. ప్రతి ఏటా 50శాతం మంది రైతులు సీడ్ ధాన్యం వైపు మొగ్గు చూపుతారు.
- ఆడ, మగ సీడ్దీ అదే దారి
ఎమ్మెన్సీ కంపెనీలై బేయర్, సిజెంటా, ఐటీసీ, ధాన్య, పాయినీర్ వంటి కంపెనీలు ఆడ, మగ సీడ్ను రైతులకు అందజేస్తారు. క్వింటాల్ ధాన్యానికి 4,200నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ధర చెల్లిస్తారు. ఈ కంపెనీలు కూడా ఈసారి క్వింటాల్కు 500 రూపాయల వరకు ధర తగ్గించారు. రైతులు భూములను బీడుగా ఉంచొద్దనే ఉద్దేశంతో సీడ్ కంపెనీలు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు.
- ఇక్కడి సీడ్కు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్
ఈ ప్రాంతంలో పండించిన సీడ్కు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కువగా సాగు చేస్తారు. హుజూరాబాద్ డివిజన్లో సీడ్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీడ్ ధాన్యాన్ని ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తారు.
- వ్యాపారులు ధరలు తగ్గించారు.
- సిరికొండ మల్లారావు, రైతు, సిర్సపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో సీడ్ వ్యాపారులు ధరలు తగ్గించారు. గతంలో మద్దతు ధర కంటే క్వింటాల్కు అదనంగా వంద రూపాయలు ఇచ్చే వారు. ఈసారి క్వింటాల్కు 300 రూపాయల వరకు తక్కువ ఇస్తామంటున్నారు. ప్రభుత్వం పునరాలోచించి ధాన్యం కొనుగోలు చేయాలి. లేకుంటే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.