విత్తన సాగు పేరిట మోసం
ABN , First Publish Date - 2022-01-21T06:00:47+05:30 IST
ప్రయోగాత్మక సాగుకు ముందుకువచ్చిన వ్యవసాయదారులు మొదటికి మోసపోయారు. మొక్కజొన్న విత్తనోత్పత్తి పంటను సాగుచేస్తే లాభాల పంట పండుతుందని అరచేతిలో స్వర్గం చూపించిన దళారీ రైతులను నట్టేట ముంచాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బోగంపాడుకు చెందిన తిరుపతిరెడ్డి సీడ్ కంపెనీ ఆర్గనైజర్నని చెప్పి అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామ రైతులను సంప్రదించారు. కాంచన సీడ్స్ అనే కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తన పంటను సాగుచేస్తే మొక్కజొన్న గింజలు తీయకుండా కంకితోనే క్వింటాలుకు రూ. 1,400 చెల్లిస్తామని నమ్మబలికాడు.
రైతులను నట్టేట ముంచిన సీడ్ కంపెనీ ఆర్గనైజర్
కాంచన్ సీడ్స్ విత్తనాల సరఫరా
కుందనవానిపల్లిలో 50 ఎకరాల్లో సాగు
పూత రావడంలేదని చేతులెత్తేసిన ఆర్గనైజర్
అక్కన్నపేట, జనవరి 20 : ప్రయోగాత్మక సాగుకు ముందుకువచ్చిన వ్యవసాయదారులు మొదటికి మోసపోయారు. మొక్కజొన్న విత్తనోత్పత్తి పంటను సాగుచేస్తే లాభాల పంట పండుతుందని అరచేతిలో స్వర్గం చూపించిన దళారీ రైతులను నట్టేట ముంచాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బోగంపాడుకు చెందిన తిరుపతిరెడ్డి సీడ్ కంపెనీ ఆర్గనైజర్నని చెప్పి అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామ రైతులను సంప్రదించారు. కాంచన సీడ్స్ అనే కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తన పంటను సాగుచేస్తే మొక్కజొన్న గింజలు తీయకుండా కంకితోనే క్వింటాలుకు రూ. 1,400 చెల్లిస్తామని నమ్మబలికాడు. ఈ పంట ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుమతి వస్తుందని ఆశ చూపాడు. మార్కెట్ కంటే అధిక ధర చెల్లిస్తుండటం, భారీగా దిగుమతి వస్తుందనడంతో రైతులు అంగీకరించారు. ప్రభుత్వం యాసంగిలో వరి సాగు చెయొద్దని ఆంక్షలు విధించడంతో రైతులు ఈ పంటసాగుకు ముందుకువచ్చారు. గ్రామంలో 50 ఎకరాల్లో మొక్కజొన్న విత్తన పంటను సాగు చేశారు. ఇందుకోసం రూ. వేలల్లో ఖర్చు చేశారు. కానీ రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట 2 గజాలు కూడా పెరగలేదు. మొక్క ఎదగడం లేదని రైతులు ఆర్గనైజర్ను సంప్రదించగా ఏవేవో మందులు స్ర్పే చేయించాడు. పోషకాల పేటిర ఎరువులను వేయించాడు. అయినా ఫలితంలేక ఆందోళన చెందుతున్న సమయంలోనే ఆర్గనైజర్ రైతులకు మరో షాక్ ఇచ్చాడు. మీరు వేసిన పంట పూత, కాత రావడం లేదని, పంటను దున్నేసి వేరే పంటను సాగు చేసుకోవాలని చల్లగా చెప్పాడు. దీంతో రైతులు ఊసూరుమంటున్నారు. విత్తన పంట అని చెప్పడంతో మామూలు కంటే ఎక్కువ శ్రద్ధతో సాగు చేశామని, రెట్టింపు ఖర్చు చేశామని రైతులు వాపోతున్నారు. పరిహారం చెల్లించాలని అడిగితే ఆర్గనైజర్ మొఖం చాటేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
రూ. 75 వేల పెట్టుబడి పెట్టాను : బత్తుల సంపత్, కుందనవానిపల్లి
ఐదెకరాల్లో మొక్కజొన్న విత్తన పంటను సాగుచేశా. సీడ్ కంపెనీవారు చెప్పిన మందులు, ఎరువులను వేయడానికి రూ. 75 వేలు ఖర్చయ్యింది. పూత సరిగ్గా రావడంలేదని పంట మొత్తం తీసేయమని ఆర్గనైజర్ చెప్తున్నాడు.
ఆర్గనైజర్పై చర్యలు తీసుకోవాలి : బత్తుల సాయిలు, కుందనవానిపల్లి
మొక్కజొన్న విత్తనం పంట సాగుచేస్తే రూ. లక్షల్లో లాభం వస్తుందని ఆశ చూపిన ఆర్గనైజర్ ఇప్పుడు చేతులెత్తేశాడు. ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. నాసిరకం విత్తనాలు ఇచ్చిన ఆర్గనైజర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.