గవర్నర్ పర్యటనకు కట్టుదిట్ట ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-05-22T05:07:11+05:30 IST
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటనకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జేసీ హరేందిర ప్రసాద్ సూచించారు.
అధికారుల సమీక్షలో జేసీ హరేందిర ప్రసాద్
వెంకటాచలం, మే 21 : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటనకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జేసీ హరేందిర ప్రసాద్ సూచించారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఈనెల 24న గవర్నర్ రానున్న నేపథ్యంలో శనివారం జేసీ వీఎస్యూలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా కేటాయించిన విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. గవర్నర్ పర్యటించే వీఎస్యూ, నెల్లూరులోని కేన్సర్ ఆసుపత్రి, పోలీస్ పరేడ్ మైదానంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వీఎస్యూ, పోలీసు పరేడ్ మైదానంలో హెలిప్యాడ్లను పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి, వీఎస్యూ రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ బాపిరెడ్డి, నెల్లూరు, కావలి ఆర్డీవోలు కొండయ్య, శీనా నాయక్, జడ్పీ సీఈవో వాణి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు సాంబశివారెడ్డి, తిరుపతయ్య, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తదితరులున్నారు.