హుండీల లెక్కింపు కట్టుదిట్టం
ABN , First Publish Date - 2022-05-19T06:21:14+05:30 IST
హుండీల లెక్కింపు కట్టుదిట్టం
విజయవాడ, మే 18 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మ ఆలయ హుండీల ఆదాయాన్ని లెక్కించే ప్రదేశంలో నిఘా, భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇటీవల మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి హుండీల లెక్కింపు కొనసాగుతుండగా, అటెండర్ కొన్ని కానుకలను బాత్రూమ్లో దాచిపెట్టిన ఉదంతం ఆలయంలో భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులు నిర్ణయించారు. పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ డీసీపీ కె.బాబూరావు, వన్టౌన్ పోలీసులు బుధవారం దుర్గగుడికి వచ్చి అమ్మవారి హుండీల ఆదాయాన్ని లెక్కించే ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. అనంతరం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.రమాదేవి, ఇతర అధికారులతో సమీక్షించారు. అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హుండీల లెక్కింపు సమయంలో ప్రత్యేక భద్రతా సిబ్బందితో పాటు పోలీసులు కూడా వచ్చి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వన్టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, కమాండ్ కంట్రోల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.