టాక్సీ డ్రైవర్ సమాచారంతో ముకేష్ అంబానీ ఇంటికి భద్రత కట్టుదిట్టం
ABN , First Publish Date - 2021-11-09T01:04:38+05:30 IST
భారత కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నివాసమైన 'ఆంటెల్లా' వద్ద ముంబై పోలీసులు సోమవారం ..
ముంబై: భారత కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నివాసమైన 'ఆంటిలియా' వద్ద ముంబై పోలీసులు సోమవారం సాయంత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక టాక్సీ డ్రైవర్ నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ముకేష్ నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముకేష్ ఇంటి చిరునామా కోసం ఇద్దరు వ్యక్తులు వాకబు చేశారంటూ టాక్సీ డ్రైవర్ నుంచి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. తానొక ట్రాక్సీ డ్రైవర్నని, తన వాహనంలో ఎక్కిన ఇద్దరు ప్రయాణికులు అంబానీ ఇల్లు చెప్పమని అడిగారని అతను సమాచారం ఇచ్చారు. దీనిపై నిజానిజాలు నిర్ధారించుకునే ప్రయత్నాలను ముంబై పోలీసులు చేపట్టారు.
కాగా, ముకేష్ నివాసం వద్ద పరిస్థితిని డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆంటెల్లా నివాసం చుట్టూ భద్రతను పెంచడంతో పాటు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీసీటీవీలతో నిఘా ఉంచారు. గత ఫిబ్రవరిలో పేలుడు పదార్ధాలతో ఉంచిన ఎస్యూవీని ఆంటల్లా సమీపంలో ఉంచినట్టు భద్రతా ఏజెన్సీలు గుర్తించడం తీవ్ర కలకలం రేపింది.