Secunderabad railway station అల్లర్ల కేసు.. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
ABN , First Publish Date - 2022-06-19T23:32:41+05:30 IST
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad railway station) అల్లర్ల కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad railway station) అల్లర్ల కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. 40కి పైగా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నుంచి ఆర్మీ అభ్యర్థులు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. అకాడమీ నిర్వాహకుల అత్యుత్సాహం వల్లే అల్లర్లు జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది. రైల్వేస్టేషన్ టార్గెట్గా 10 వాట్సాప్ గ్రూప్లు ఏర్పడినట్లు గుర్తించారు. వాట్సాప్ చాట్, వీడియోస్, సోషల్మీడియా పోస్ట్ల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటివరకు 200 మందిని పోలీసులు గుర్తించారు. విధ్వంసానికి కారణమైన వారిలో 52 మందిని శనివారం పోలీసులు గుర్తించారు. వారిలో 19 మంది గోపాలపురం పోలీసుల అదుపులో ఉండగా.. మిగిలిన వారిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ గ్రూపుల ఏర్పాటుపై ఆరా తీసి నట్లు సమాచారం.
విధ్వంసం వెనుక ఆవుల?
విధ్వంసం వెనుక ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం వాస్తవ్యుడు, తెలుగు రాష్ట్రాల్లో సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసి.. తన ప్రసంగాలతో అకాడమీలో శిక్ష ణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి.. ఆందోళన కార్యక్రమానికి పథకం పన్ని.. అందుకు వేదికగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎంపిక చేసి.. వాట్సాప్ గ్రూప్లు క్రియేట్చేసి.. అభ్యర్థులను తరలింపులో అన్నీతానై వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆవులను కంభం పోలీసులు శనివారం అరెస్టు చేయగా.. తెలంగాణ పోలీసులు హైదరాబాద్కు తరలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆవులను రైల్వే పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.