Secunderabad ఆందోళన.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు
ABN , First Publish Date - 2022-06-17T18:09:38+05:30 IST
రద్దు చేసిన ఆర్మీ పరీక్ష తిరిగి పెట్టాలని.. అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.
సికింద్రాబాద్ : రద్దు చేసిన ఆర్మీ పరీక్ష(Army test) తిరిగి పెట్టాలని.. అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్ మొత్తం రక్తసిక్తంగా మారింది. రైళ్లను తగులబెట్టడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పూర్తిగా ధ్వంసం చేయడంతో రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఛాతీలో బుల్లెట్ దిగడంతో యువకుడిని హుటాహుటిన పోలీసులు గాంధీకి తరలించారు. కాగా.. ఆ యువకుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఆందోళనలో గాయపడిన పలువురు యువకులను సైతం గాంధీకి తరలించారు. అక్కడ వారికి చికిత్స జరుగుతోంది. ఒక ఆందోళనకారుడికి వెన్నెముక విరిగింది. అతని బ్లడ్ ఎక్కించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. గాయపడిన వారు... లక్ష్మారెడ్డి , వినయ్, విద్యాసాగర్, చంద్రు, దామెర కరేశ్, దండు మహేష్, నాగేందర్ బాబు, జగన్నాథ్గా గుర్తించారు.
అగ్నికి ఆజ్యం పోసినట్టు..
కాగా.. మూడు సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఫిజికల్ టెస్ట్లు పూర్తి చేసుకుని చాలా నెలలు గడుస్తున్నా ఎగ్జామ్ పెట్టకుండా రద్దు చేయడంతో ఆర్మీ అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తాజాగా కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీనిలోని అంశాలు అభ్యర్థులకు పూర్తి నిరాశాజనకంగా ఉండటంతో ఆర్మీ అభ్యర్థులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ క్రమంలోనే బీహార్ వంటి పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఆందోళనలు జరిగాయి.