ప్రజలకు చేరువగా సచివాలయాలు
ABN , First Publish Date - 2020-06-02T10:11:24+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని జేసీ డాక్టర్ రావిరాల మహేష్కుమార్ అన్నారు
జేసీ మహేష్కుమార్
తన చాంబరులో బాధ్యతల స్వీకారం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
గ్రామ, వార్డు సచివాలయాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని జేసీ డాక్టర్ రావిరాల మహేష్కుమార్ అన్నారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం జేసీగా నియామకమైన ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థతో అనేక సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం కానున్నాయన్నారు. ఆ దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రజలకు పాలను మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానన్నారు. సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు అందుతాయని, వాటి గురించి ప్రజలకు అవగాహన పరుస్తామన్నారు.
జిల్లాకు సోమవారం చేరిన తర్వాత తొలుత కలెక్టర్ ఎమ్.హరిజవహర్లాల్ను కలిశారు. అనంతరం తన చాంబరులో బాధ్యతలు చేపట్టారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన మహేష్ కుమార్ ఇదివరకు రాజమండ్రి సబ్కలెక్టర్గా పనిచేశారు. బదిలీపై జేసీగా జిల్లాకు వచ్చారు. ఈయన నల్గొండ జిల్లాకు చెందినవారు.
అదే జిల్లాలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. విజయవాడలోని సిద్ధార్థా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్ రాసి ఉత్తమ ర్యాంకు సాధించారు. నెల్లూరు అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పూర్తి చేసుకున్నాక చిత్తూరు జిల్లా తిరుపతి సబ్కలెక్టర్గా తొలిపోస్టింగ్ పొందారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాకు సబ్కలెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి పనుల పర్యవేక్షణకోసం జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) పేరుతో పోస్టింగులిచ్చింది. సచివాలయాల పర్యవేక్షణను కూడా అప్పగించింది.