అయినా.. ఆగని నిర్మాణం

ABN , First Publish Date - 2020-11-16T06:14:50+05:30 IST

నిర్మాణాలు ఆపాలన్న న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోని అధికారులు

అయినా.. ఆగని నిర్మాణం
జోరుగా సాగుతున్న సచివాలయ నిర్మాణ పనులు

కోర్టు ఉత్తర్వులను పట్టించుకోని అధికారులు

టీడీపీ నేతల స్థలంలో సచివాలయ పనులు 


శ్రీకాళహస్తి, నవంబరు 15: తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిర్మాణాలు ఆపాలన్న న్యాయస్థానం ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. తొట్టంబేడు మండలం కాసరంలో తాము అనుకున్నచోటే సచివాలయ పనులు చేసుకుపోతున్నారు. బాధితులు తెలిపిన ప్రకారం.. కాసరం గ్రామ సర్వే నంబరు 28-1లో 12.73 ఎకరాల గ్రామకంఠంలో స్థానికులు ఇళ్లు కట్టుకుని ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ నేతలు వీరరాఘవులునాయుడు, రత్నంనాయుడు, మస్తాన్‌నాయుడుకు ఇలా తాతల తరం నుంచి గ్రామం మధ్యలో సుమారు 35సెంట్ల స్థలం వారసత్వంగా వచ్చింది. ఈ స్థలంలో వీరు గడ్డివాములు వేసుకుని, పశువులు కట్టేసేవారు. ఈ క్రమంలో ప్రస్తుతం సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి చేపట్టారు. దీనికి గ్రామం పక్కనే ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతల సూచనతో సచివాలయ నిర్మాణానికి టీడీపీ నేతల 35 సెంట్ల స్థలాన్ని ఎంచుకున్నారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. అధికారులు పట్టించుకోలేదు. గడ్డి వాములను తొలగించారు. అడ్డుకున్న సుధాకరనాయుడు, మస్తాన్‌నాయుడుపై పోలీసు కేసు పెట్టారు. పోలీసు కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కేసులకు భయపడిన టీడీపీ నేతలు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు.  ఆ తర్వాత వారు శ్రీకాళహస్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిర్మాణాలు ఆపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తొట్టంబేడు తహసీల్దారు పరమేశ్వరస్వామితో పాటు మొత్తం 15మందికి నోటీసులు కూడా ఇటీవల జారీ చేశారు. అయినా అధికారులు పట్టించుకోకుండా కాసరంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులు చేస్తూనే ఉన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2020-11-16T06:14:50+05:30 IST