సెకండ్ వేవ్లో ఏ డైట్ ?
ABN , First Publish Date - 2021-05-14T19:47:58+05:30 IST
కేవలం కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు, కషాయాలు, కొన్ని టాబ్లెట్లు, సప్లిమెంట్ల వల్ల మన రోగ నిరోధకవ్యవస్థ అమాంతం పటిష్టమైపోదు. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే
ఆంధ్రజ్యోతి(14-05-2021)
ప్రశ్న: కరోనా రెండో వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- రాఘవేంద్ర, కడప
డాక్టర్ సమాధానం: కేవలం కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు, కషాయాలు, కొన్ని టాబ్లెట్లు, సప్లిమెంట్ల వల్ల మన రోగ నిరోధకవ్యవస్థ అమాంతం పటిష్టమైపోదు. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే దీర్ఘకాలికంగా మన శరీరంలో నిరోగనిరోధక వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లు వారానికి రెండు మూడుసార్లు తీసుకోవచ్చు. కానీ వీటిని ఎక్కువ నూనెలో వేయించి వండకుండా ఏదైనా ఆకుకూరలు లేదా కూరగాయలతోపాటు తీసుకుంటే మంచిది. శాకాహారులు ప్రొటీన్ల కోసం అన్ని రకాల పప్పులు, గింజలు మొదలైనవి రోజూ తీసుకోవాలి. సి విటమిన్ కోసం సంత్రా, జామపండ్లు, పచ్చి కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలతో చేసిన సలాడ్లు ప్రతి పూటా తీసుకోవాలి. వీలైనన్నిసార్లు ఆకుకూరలు, గింజల, కూరలు, తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఖనిజాలన్ని రోగనిరోధకవ్యవస్థ పటిష్టంగా ఉండడానికి అత్యవసరం. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, దాల్చినచెక్క లాంటి రోజు వారీ వంట దినుసులు కూడా మన ఇమ్మ్యూనిటీకి సహకరిస్తాయి. ఫాస్ట్ ఫుడ్స్,, వేయించిన చిరుతిళ్ళు, స్వీట్లు మొదలైన వాటికి దూరంగా ఉండడం ఎంతో ముఖ్యం. పరిమితికి మించి తీసుకునే టీ, కాఫీ, మద్యపానం రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. మానసిక ఆందోళన తగ్గించుకోవడం వల్ల ఈ వ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)