పోలీస్ సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-03-07T07:30:17+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభమైంది. అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో డీజీపీ మహేందర్రెడ్డి వ్యాక్సిన్ వేయించుకున్నారు.
- రాష్ట్రంలో కొత్తగా 24,855 మందికి టీకా
- తెలంగాణలో మరో 170 కొత్త కేసులు
- హాస్టల్లో నలుగురు విద్యార్థులకు పాజిటివ్
- కర్ణాటకలో 22 మంది విద్యార్థులకు వైరస్
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభమైంది. అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో డీజీపీ మహేందర్రెడ్డి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎంత మంది పోలీస్ అధికారులు వ్యాక్సిన్ తీసుకున్నారన్న విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. కాగా, రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 60ఏళ్ల పైబడి, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో మరో 24,855 మంది శనివారం వ్యాక్సిన్ తీసుకోగా, ఇప్పటివరకు ఈ కేటగిరీలో టీకా తీసుకున్న వారి సంఖ్య 96,443కు పెరిగింది. 325 ప్రభుత్వ కేంద్రాల్లో 10,939మంది, ప్రైవేటులోని 113 కేంద్రాల్లో 13,926 మంది టీకా తీసుకున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు మీడియా బులిటెన్లో వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 3,74,871 మంది తొలి డోసు తీసుకోగా, 1,70,629 మంది రెండో డోసు వేయించుకున్నారు.