నేటి నుంచి రెండో డోసు

ABN , First Publish Date - 2021-04-22T05:13:52+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు.

నేటి నుంచి రెండో డోసు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

మొదటి డోసు వేసుకున్న వారికి ప్రాధాన్యం

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 21:  

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి ఎస్‌.సత్యనారాయణ, జేసీ మహేష్‌ కుమార్‌, జిల్లా వైద్యాధికారి రమణకుమారి తదితరులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఇప్పటికే మొదటి డోసు వేసుకొని... గడువు తీరిన వారికి మాత్రమే ప్రస్తుతం రెండో డోసు వేయనున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రెండో డోసు ప్రక్రియ చేపడుతున్నట్టు వెల్లడించారు. కోవాక్సిన్‌, కొవిషీల్డ్‌లకు వేర్వేరు కేంద్రాలు కేటాయించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వ్యాక్సిన్‌ వేస్తారని చెప్పారు. కోవిషీల్డ్‌ కోసం 64 కేంద్రాలు, కోవాక్సిన్‌కు 26 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. గతంలో కోవాక్సిన్‌ వేసుకుని ఆరు వారాలు పూర్తయిన వారు... కొవిషీల్డ్‌ వేసుకుని ఆరు నుంచి ఎనిమిది వారాలు పూర్తయిన వారు తమ ఆధార్‌ కార్డులతో సంబంధిత కేంద్రాలకు వెళ్లవలసి ఉంటుందన్నారు.

ఆందోళన వద్దు 

ఫ్రంట్‌లైన్‌ వారియర్లతో పాటు 45 ఏళ్లు దాటిన సాధారణ ప్రజలకు కూడా వ్యాక్సిన్‌ వేయనున్నట్టు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ప్రస్తుతానికి సరిపడినంత వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉందన్నారు. జిల్లా అవసరాలకు కావలసినంత వ్యాక్సిన్‌ త్వరలో రానుందని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఆయన కోరారు.

 

Updated Date - 2021-04-22T05:13:52+05:30 IST