10న సుప్రీంలో ఎస్‌ఈసీ కేసు విచారణ

ABN , First Publish Date - 2020-06-07T11:36:27+05:30 IST

10న సుప్రీంలో ఎస్‌ఈసీ కేసు విచారణ

10న సుప్రీంలో ఎస్‌ఈసీ కేసు విచారణ

న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ 10న విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఆరోజు మధ్యాహ్నం 12గంటల నుంచి ధర్మాసనం కేసుల విచారణను ప్రారంభిస్తుంది. కేసుల జాబితాలో ఇది 11వ కేసు. కాగా, దీనిలో జస్టిస్‌ కనగరాజ్‌ను ప్రతివాదిగా చేర్చడంతో పాటు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన ఇతర లోపాలను రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాదులు సరిదిద్దారు. దాంతో లోపాల జాబితా నుంచి వాటిని రిజిస్ట్రీ తొలగించింది. కాగా, ఈ కేసులో నిర్ణయం తీసుకునేముందు తమ వాదన కూడా వినాలంటూ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, టీడీపీ నేత వర్ల రామయ్య, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలీ, బీజేపీ నేత, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌, న్యాయవాది కే జితేంద్రబాబు ఇప్పటికే కేవియెట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-06-07T11:36:27+05:30 IST