శిథిలావస్థలో కళాశాల భవనాలు
ABN , First Publish Date - 2021-04-16T05:56:53+05:30 IST
స్థానిక టీ చంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
- కూలడానికి సిద్ధంగా నిర్మాణాలు
- నిరుపయోగంగా ఒకేషనల్ తరగతి గదులు
- తుప్పుపడుతున్న సామగ్రి
పాణ్యం, ఏప్రిల్ 15: స్థానిక టీ చంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 1981లో ప్రారంభించిన కళాశాలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదుల్లోనే నిర్వహిస్తుండే వారు. 1995లో ఒక హాలు, మూడు తర గతి గదులను కళాశాలకు నిర్మించారు. వీటితో పాటు ఐదు పాఠశాల గదులు కళాశాలకు కేటాయించారు. ప్రస్తుతం కళాశాలకు నిర్మించిన గదులు శిథిలమై విద్యార్థులు కూర్చోవడానికి భయపడేలా తయారయ్యాయి. నాడు నేడు కింద ఇంత వరకు ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరు కాలేదు. కళాశాల బాలికలకు సరైన మరుగుదొడ్లు లేవు. తరగతి గదుల వరండాలు ఎప్పుడు కూలుతాయోనని విద్యార్థులు భయాందోళన చెం దుతున్నారు. ప్రభుత్వం నాడు - నేడు నిధులు కేవలం ఉన్నత పాఠశాలల వరకు మాత్రమే మంజూరు చేయడంతో జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
నిరుపయోగంగా ఒకేషనల్ విద్య గదులు : 1995లో నిర్మించిన ఒకేషనల్ విద్య తరగతి గదులు నిరుపయోగంగా మారాయి. ఒకేషనల్ కోర్సు సామాగ్రి తుప్పు పడుతున్నాయి. దీంతో విద్యార్థుల చదువులు సక్రమంగా సాగడం లేదు.
నిధులు వెంటనే మంజూరు చేయాలి
కళాశాల అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేయాలి. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను వెంటనే కూల్చి నూతన భవనాలను నిర్మించాలి. పాఠశాలకు ప్రహరీ, అదనపు గదుల నిర్మాణానికి నాబార్డు నిఽధులు మంజూరు చేయాలి.
- ప్రతాప్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ మండల అధ్యక్షుడు
ఎవరి నీరు వారే తెచ్చుకోవాలి
కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇండ్ల నుంచి తాగు నీరు తెచ్చు కొనేలా చూడాలని కళాశాల ప్రిన్సిపాళ్లను ఆదేశించాం. మోటారు మరమ్మతుకు నిధులు ఇచ్చే అవకాశం లేదు. నాడు నేడు పనులకు త్వరలో నిధులు మంజూరవుతాయి. తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు కావు.
- జమీల్పాషా, డీవీఈఓ, కర్నూలు