వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదు
ABN , First Publish Date - 2022-05-21T06:44:27+05:30 IST
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అరకులోయ ఇన్చార్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ ఆందోళన వెలిబుచ్చారు.
మాజీమంత్రి కిడారి శ్రావణ్కుమార్
డుంబ్రిగుడ, మే 20: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అరకులోయ ఇన్చార్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ ఆందోళన వెలిబుచ్చారు. శుక్రవారం ఇక్కడ జరిగిన టీడీపీ మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ మూడేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాలపై దాడులు అధికమయ్యాయన్నారు. రంపచోడవరం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్బాబు ఎస్సీ, ఎస్టీలను కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్న దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి, ప్రమాదమని చిత్రీకరించడం అన్యాయమన్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించకుండా రహస్యంగా పోస్టుమార్టం చేయించేందుకు పూనుకోవడం విచారకరమన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ను బర్తరఫ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు తుడుం సుబ్బారావు, అరకు పార్లమెంట్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి, గుంటసీమ పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కె.భాస్కరరావు, తెలుగుయువత మండల కార్యదర్శి కె.రవి పాల్గొన్నారు.