మోదీకి మన్మోహన్కు తేడా ఏంటో చెప్పిన కేంద్రమంత్రి సింధియా
ABN , First Publish Date - 2021-12-03T22:41:20+05:30 IST
మోదీ కెబినెట్లో అత్యంత ప్రాధాన్యమున్న మంత్రుల్లో సిందియా ఒకరు. మరో విషయం ఏంటంటే.. మన్మోహన్ కెబినెట్లో కూడా సిందియా పని చేశారు. ఇద్దరు ప్రధానమంత్రులతో కలిసి పని చేసిన అనుభవంతో సిందియాను ఈ ప్రశ్న అడిగారు. అయితే మోదీ కెబినెట్లో సిందియా చేరి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది..
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మధ్య తేడా ఏంటో చెప్పారు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. డైనమిజంలో ఫలితం వచ్చే విధంగా పని చేయడంలో చాలా తేడా ఉందని ఆయన అన్నారు. శుక్రవారం ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాని మధ్య ఉన్న తేడా ఏంటని అడిగిన ప్రశ్నకు సింధియా సమాధానం చెబుతూ ‘‘ఇద్దరి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫలితం వచ్చే విధంగా పని చేస్తారు. ఆయన పని విధానంలో కూడా డైనమిజం ఉంటుంది’’ అని అన్నారు.
మోదీ కెబినెట్లో అత్యంత ప్రాధాన్యమున్న మంత్రుల్లో సింధియా ఒకరు. మరో విషయం ఏంటంటే.. మన్మోహన్ కెబినెట్లో కూడా సింధియా పని చేశారు. ఇద్దరు ప్రధానమంత్రులతో కలిసి పని చేసిన అనుభవంతో సింధియాను ఈ ప్రశ్న అడిగారు. అయితే మోదీ కెబినెట్లో సింధియా చేరి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. ఈ నాలుగు నెలల్లో తాను పరిశీలించింది ఇదేనని సింధియా తేల్చి చెప్పారు.
స్వతహాగా కాంగ్రెస్ పార్టీ అయిన సింధియా.. గతేడాది తనకు మద్దతుగా ఉన్న 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యలతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్లో కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం మరోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు.