అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై సింధియా ఫైర్

ABN , First Publish Date - 2020-08-07T02:02:44+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య..

అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై సింధియా ఫైర్

భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘‘పిచ్చోర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు తీవ్రంగా బాధిస్తాయి. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్‌కు ప్రజల్లో అపార గౌరవం ఉంది...’’ అని సింధియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలనీ... సంపూర్ణ గౌరవంతో విగ్రహాన్ని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. పిచ్చోర్ బస్ స్టేషన్ సమీపంలో మంగళ వారం రాత్రి మాస్కు ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. సమీపంలోని ఓ సీసీకెమేరాలో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

Updated Date - 2020-08-07T02:02:44+05:30 IST