పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-04-17T06:03:42+05:30 IST
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో నాగమణి ఆదేశించారు.
పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి
డీఈవో నాగమణి
కలెక్టరేట్, ఏప్రిల్ 16: పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో నాగమణి ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ , మధ్యాహ్నా భోజన పథకం అమలుపై శుక్రవారం కలెక్టరేట్లో ఎంఈవో, హెచ్ఎంలు, సీఆర్పీలు, ఉపాధ్యాయలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన డీఈవో నాగమణి మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్ల సదుపాయం, పారిశుధ్యం మెరుగుపరచడం ద్వారా పిల్లల హాజరుశాతాన్ని పెంచొచ్చన్నారు. బాలికల శాతం తగ్గిపోవడానికి మరుగుదొడ్ల కొరతే కారణమన్నారు. సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు జరిగిన ఒక సర్వేలో ఇది తేటతెల్లమైందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర శిక్ష కార్యక్రమాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. నాడు-నేడు మొదటి దశ కింద రూ.246 కోట్లతో 1014 పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రెండో విడత పనులు మే నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 10,874 మంది విద్యార్థులు చేరడం గొప్ప విషయమన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంద న్నారు. డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీ, ఏడీ అరుణజ్యోతి తదితరులు ఉన్నారు.