స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదు: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2022-01-17T21:59:29+05:30 IST

స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని నిబంధనలే చెబుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదు: మంత్రి సురేష్

అమరావతి: స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని నిబంధనలే చెబుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్ల నిర్వహిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లలో కరోనా దృష్ట్యా పరీక్షలు నిర్వహించలేదని, విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగిస్తామని ప్రకటించారు. విద్యార్థులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి సురేష్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి కాలేదని స్కూళ్లను తెరవొద్దంటూ.. ప్రతిపక్షాలు కామెంట్లు చేయడం దురదృష్టకరమన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిక అనవసరమని తోచిపుచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పెట్టలేకపోయినా ఏపీలో నిర్వహించామని తెలిపారు. ఆన్‌లైన్ బోధన ఒక లెవల్ వరకే పరిమితమని, క్లాసులకు ఫిజికల్‌గా వెళ్లడానికి ఆన్‌లైన్ బోధన ప్రత్యామ్నాయం కాదని సురేష్ వివరించారు.


సంక్రాంతి సెలవులు ముగియడంతో రాష్ట్రంలో పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించడమో.. లేక ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడమో చేస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు భావించారు. దీనికితోడు పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో మన రాష్ట్రంలోనూ సెలవులు పొడిగించవచ్చని అనుకున్నారు. అయితే సెలవులపై పునరాలోచన లేదని ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. యథావిధిగా సోమవారం పాఠశాలలు, ఇంటర్‌ కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-17T21:59:29+05:30 IST