భయంగానే.. బడి బాట!

ABN , First Publish Date - 2021-08-13T05:20:44+05:30 IST

పాఠశాలల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణం ద్వారా శానిటైజేజ్‌ చేసే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు...

భయంగానే.. బడి బాట!

 కరోనా.. పిల్లలకు చదువును దూరం చేసింది. విలువైన కాలాన్ని ఇంటిపట్టునే గడిపే పరిస్థితిని తీసుకువచ్చింది. కరోనా రెండోదశ దాటుకుంటున్న ఈ సమయంలో ఈ నెల 16నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం నిర్వహించింది. టీచర్లకు ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు వేయలేదు. కరోనా మూడోవేవ్‌ ముప్పు పొంచి ఉందని.. అది పిల్లలపై ప్రభావం చూపుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారులను భయంగానే.. బడికి పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. 


 ఈ నెల 16 నుంచి బడులు పునఃప్రారంభం

 ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజ్‌ ప్రక్రియ ఏదీ?

 మొదటి డోసు వేయించుకుంది 75శాతం మంది ఉపాధ్యాయులే!

 రెండో డోసు వేయించుకున్న వారు 60శాతం మంది

 విద్యార్థుల హాజరుశాతంపై ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు


గుంటూరు(విద్య), ఆగస్టు 12: పాఠశాలల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణం ద్వారా శానిటైజేజ్‌ చేసే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు... మరోవైపు  జిల్లాలో  రెండు  డోసులు  వాక్సిన్‌ తీసుకున్న ఉపాధ్యాయులు 55శాతం నుంచి 60శాతం మంది మాత్రమే ఉన్నట్లు సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభానికి కసరత్తు చేస్తోంది. వీటన్నింటి నడుమ విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొవిడ్‌ మూడోదశ ఇప్పటి నుంచే భయపెట్టేస్తోంది. పాఠశాలకు విద్యార్థుల్ని పంపుదామా లేదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే వారికి భరోసా ఇచ్చే వారు మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా భయం భయంగానే బడిబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. 

 

 పునః ప్రారంభించడానికి సన్నాహాలు..

జిల్లాలో ఈనెల 16 నుంచి పాఠశాలల్ని పునః ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జగన్న విద్యాకిట్లు, పుస్తకాలు, దుస్తులు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల భద్రత గురించి పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో 4వేలపైగా పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాశాలల్లో 6లక్షలపైన విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలస్థాయి వరకు దాదాపు 14వేల మంది ఉపాధ్యాయులుంటే వారిలో రెండు డోసులు వాక్సిన్‌ తీసుకున్న వారు సగం మాత్రమేనని ఉపాఽధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. మొదటి డోసు మాత్రం 85శాతం మంది తీసుకున్నారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు ఎంతమంది వాక్సిన్‌ తీసుకున్నారనే సమాచారం విద్యాశాఖ వద్ద లేదు. కాగా విద్యార్థుల హాజరు శాతాన్ని నిర్ణయించాలని ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ నేతలు కోరుతున్నారు.  పాఠశాలలు పునః ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ నాయకుడు నాయుడు చక్రనాగ్‌ తెలిపారు. 

 

 కొవిడ్‌ వారియర్స్‌గా గుర్తించలేదు..

ఉపాధ్యాయుల్ని కొవిడ్‌ వారియర్స్‌గా గుర్తించడం లేదు. దీంతో వాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 15 రోజుల ముందు వాక్సినేషన్‌ హడావుడి చేస్తున్నారు. ఇది మొదటి నుంచి చేసినట్లు అయితే బాగుండేది. మా లెక్కల ప్రకారం మొదటి డోసు 75శాతం మందికి పూర్తి అయింది. రెండో డోస్‌ తీసుకున్నవారి శాతం 55- 60 మధ్యన శాతం ఉంది. కొవిడ్‌ కేసులున్నా వాక్సినేషన్‌, శానిటైజేషన్‌ చేయలేదు. పాఠశాలకు వందమీటర్ల దూరంలోనే కేసులున్నా పట్టించుకోవడం లేదు. ఉపాఽధ్యాయులు సొంత ఖర్చులతో హైపోక్లోరైడ్‌  పిచికారి చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రుల్లో కొవిడ్‌ భయం ఇంకా ఉంది.

- పి.ప్రేమ్‌కుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

 

నిరసనల మధ్య పాఠశాలల పునఃప్రారంభం

ఈనెల 14 నుంచి నూతన విద్యావిధానంపై నిరసనలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఉపాధ్యాయులకు మొదటి డోసు 95శాతం పూర్తి అయిందని చెబుతోంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి మేమే దగ్గరుండి వాక్సినేషన్‌ పూర్తిచేయించాం. శానిటైజేషన్‌ సరిగా చేయడం లేదు. తల్లిదండ్రుల్ని సన్నద్ధం చేయాలి. ప్రాథమిక పాఠశాలలు ఒకటి రెండు గదులు ఉంటాయి. అదే ఉన్నత పాఠశాలలు 10, 15 గదులు ఉంటాయి. దానివల్ల పాఠశాల పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ జరగడం లేదు.

- ఎస్‌.రామచంద్రయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు 

Updated Date - 2021-08-13T05:20:44+05:30 IST