Droupadi Murmu: ప్రమాణస్వీకారం వేళ.. చదువుకున్న స్కూల్లో సంబరాలు
ABN , First Publish Date - 2022-07-25T21:24:55+05:30 IST
దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్లమెంటులో
రాయ్రంగాపూర్(ఒడిశా): దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్లమెంటులో ప్రసంగించిన వేళ.. అక్కడికి సరిగ్గా 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్(Mayurbhanj) జిల్లాలోని ఓ స్కూల్లో సంబరాలు మిన్నంటాయి. దీనికి ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం రాయ్రంగాపూర్లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్ అండ్ రీసెర్చ్ సెంటర్(Sri Aurobindo Integral Education and Research Centre)లో ముర్ము ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. 1994 నుంచి 1997 వరకు వేతనం తీసుకోకుండానే అన్ని సబ్జెక్టులను ఆమె బోధించారు.
1997లో ముర్ము రాయ్రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్గా ఎంపికయ్యారు. అలా ప్రారంభమైన ఆమె రాజకీయ ప్రస్థానం ఇప్పుడు దేశ అత్యున్నత పదవికి చేరుకునే వరకు సాగింది. దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా, ఆ పదవిని అలంకరించిన రెండో మహిళగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్కూల్లో సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము ఇప్పుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడంపై స్కూలు కమిటీ అధ్యక్షుడు రవీంద్ర పట్నాయక్ మాట్లాడుతూ.. ఆమె రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు. వేతనం తీసుకోకుండానే ఆమె పాఠాలు చెప్పేవారన్నారు. అరబిందో, మిర్రా అల్ఫాసా వంటి వారి నుంచి ఆమె ప్రేరణ పొందారన్నారు. ముర్ము ప్రసంగాన్ని తాము టీవీలో చూశామని, ఆమె తన ప్రసంగంలో తమ స్కూలును ప్రస్తావించారని విద్యార్థులు అన్నారు. ఆమె తమ స్కూలును సందర్శించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆమెను రాష్ట్రపతిగా చూడడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
స్కూలు ప్రిన్సిపాల్ ప్రమీలా స్వైన్ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ములో సహనం చాలా ఎక్కువని, ఆమె క్లాస్రూము టేబుల్పై ఎప్పుడూ ఓ చాక్లెట్ బాక్స్ ఉండేదని అన్నారు. సరైన జవాబులు చెప్పేవారికి ఆమె చాక్లెట్లు ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. సమయ పాలనకు ఆమె ప్రాణమిచ్చే వారని ప్రమీల పేర్కొన్నారు. కాగా, స్కూలు త్వరలోనే 150 వసంతాల వేడుక నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముర్ము హాజరవుతారని టీచర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.