స్పెల్లింగ్స్ నేర్పుతానని పిలిచిన స్కూల్ డైరెక్టర్.... చివరికి టెర్రర్

ABN , First Publish Date - 2021-10-04T22:08:41+05:30 IST

స్పెల్లింగులు నేర్పుతానని ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులను తన గదికి పిలిపించుకున్న స్కూలు డైరెక్టర్ వారితో అసభ్యంగా

స్పెల్లింగ్స్ నేర్పుతానని పిలిచిన స్కూల్ డైరెక్టర్.... చివరికి టెర్రర్

రాజ్‌కోట్: స్పెల్లింగులు నేర్పుతానని ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులను తన గదికి పిలిపించుకున్న స్కూలు డైరెక్టర్ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిందీ ఘటన. లోధిక తాలుకాలోని ఓ స్కూల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దినేశ్ జోషి కొన్ని రోజుల క్రితం స్పెల్లింగులు నేర్పుతానని బాలికలు ఇద్దరిని తన గదికి పిలిచాడు. అనంతరం వారిని బలవంతంగా కౌగిలించుకోవడమే కాక, అసభ్యంగా తాకాడు. 


బాధిత బాలికల్లో ఒకమ్మాయి ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. గతంలోనూ అతడు ఇలాగే ప్రవర్తించాడని చెప్పింది. ఇతర అమ్మాయిలను కూడా జోషి ఇలాగే బలవంతంగా కౌగిలించుకుంటున్నట్టు చెప్పడంతో వారు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. శనివారం దాదాపు వందమంది తల్లిదండ్రులు లోధిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జోషిపై ఫిర్యాదు చేశారు.


నిందితుడు జోషి భార్య సీమా జోషి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. తన భర్తపై ఫిర్యాదు విషయం తెలుసుకున్న ఆమె బీజేపీ రాజ్‌కోట్ జిల్లా మాజీ అధ్యక్షుడు బీకే సత్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.  ఇద్దరూ కలిసి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరికి బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో జోషిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.

Updated Date - 2021-10-04T22:08:41+05:30 IST