ఏకలవ్య పాఠశాల ప్రహరీ స్థలాన్ని రీ సర్వే చేయండి
ABN , First Publish Date - 2022-05-27T06:40:42+05:30 IST
మండలంలోని రవీంద్రనగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య పాఠశాల ప్రహరీ స్థలాన్ని రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ఆదేశించారు.
- జేసీ, ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే
రాజవొమ్మంగి, మే 26: మండలంలోని రవీంద్రనగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య పాఠశాల ప్రహరీ స్థలాన్ని రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ఆదేశించారు. గురువారం తొలిసారిగా మండల పర్యటనకు వచ్చిన ఆయన చెరుకుంపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా కేంద్రాల ను పరిశీలించి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జడ్డంగి సమీపంలోని మడేరువాగు ఆనకట్టను పరిశీలించి ఈ వాగు ద్వారా ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగి, జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి బర్త్ వెయిటింగ్ హాలులో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఇంకా కావాలా అని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదకర గర్భిణులను అనుక్షణం పర్యవేక్షించాలన్నారు. ఫీడర్ అంబులెన్స్ డ్రైవర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వచ్చిన ఫోన్లను రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పర్యటనలో తహశీల్దారు వైవీ సుబ్రహ్మణ్యాచార్యులు, ఎంపీడీవో కామేశ్వరరావు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఏటిడబ్యూ హాసిని, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గౌతమి, ఎంఈవో తాతబ్బాయిదొర, ఏఈ రవితేజ పాల్గొన్నారు.