పాఠశాల భవనం కూల్చివేత
ABN , First Publish Date - 2022-07-04T06:05:20+05:30 IST
నగరంలోని కాకానిరోడ్డులో గల సీతానగరంలోని ఎయిడెడ్ పాఠశాల భవన సముదాయాన్ని గత అర్ధరాత్రి పాక్షకింగా కూల్చివేశారు.
వైసీపీ వర్గీయుల దుశ్చర్యగా ఆరోపణలు
గుంటూరు(కార్పొరేషన్), జూలై 3: నగరంలోని కాకానిరోడ్డులో గల సీతానగరంలోని ఎయిడెడ్ పాఠశాల భవన సముదాయాన్ని గత అర్ధరాత్రి పాక్షకింగా కూల్చివేశారు. అర్ధరాత్రి వేళలో జేపీబీతో వచ్చిన కొందరు పాఠశాల పైకప్పును కూల్చివేసినట్లు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ దందాకు పాల్పడ్డట్లు పాఠశాల అభివృద్ధి కమిటీ నాయకులు తెలిపారు. ఈ పాఠశాల స్థలం గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. పాఠశాల స్థలం స్థానికులు తమదని చెపుతుండగా అభివృద్ధి కమిటీ మాత్రం ప్రభుత్వ పాఠశాలగా చెబుతున్నారు. కొద్దికాలం క్రితం ఈ పాఠశాల మున్సిపల్ కమిషనర్కు, అధికారులకు ఫిర్యాదు చేసి పాఠశాల స్థలాన్ని స్వాధీనపరచాలని స్థానికులు కోరారు. కానీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపించి వైసీపీకి చెందిన ఓ నాయకునికి అమ్మినట్లు తెలిసింది. దీంతో ఆ నాయకుడు గత రాత్రి తన అనుచరులతో వచ్చి పాఠశాల భవనాన్ని కూల్చివేసినట్లు తెలిసింది. దీంతో పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
ఎనిమిది మందిపై కేసు నమోదు
సీతానగర్లో పాఠశాల భవనాన్ని అనధికారికంగా కూల్చివేసిన సుధాకర్రెడ్డి, వేణుగోపాలరెడ్డితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు పాతగుంటూరు సీఐ కె.వాసు తెలిపారు. సరస్వతి ఎయిడెడ్ పాఠశాల విద్యాకమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.