‘నాగపడగల’ కొరత

ABN , First Publish Date - 2022-07-06T06:48:56+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో నాగపడగల కొరత ఏర్పడటంతో రాహుకేతు పూజలకు అవస్థలు తప్పలేదని భక్తులు వాపోయారు.

‘నాగపడగల’ కొరత
రాహుకేతు పూజ టిక్కెట్టు కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ

శ్రీకాళహస్తి, జూలై 5: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నాగపడగల కొరత ఏర్పడటంతో రాహుకేతు పూజలకు అవస్థలు తప్పలేదని భక్తులు వాపోయారు. ఆలయంలో మంగళవారం ఉదయం 11గంటల నుంచి రాహుకేతు పూజల్లో ఉపయోగించే వెండి నాగపడగల ప్రతిమల సరఫరా తగ్గింది. దాంతో టిక్కెట్టు కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. సుమారు గంటపాటు క్యూలైన్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రైళ్ల రిజర్వేషన్లు, ఇతర కారణాలతో పూజల్లో పాల్గొనకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. రెండు నెలల క్రితం కూడా నాగపడగల కొరత ఏర్పడి తీవ్ర దుమారం రేగింది. తాజాగా అలాంటి సమస్యే తలెత్తింది. మరోవైపు ఈవో సాగర్‌బాబు, పాలకమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. నాగపడగలు తయారయ్యే మింటులో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి.. మధ్యాహ్నం వేళకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 


కొరత అవాస్తవం: చైర్మన్‌

నాగపడగల కొరత అవాస్తవం. వరుసగా మూడ్రోజులపాటు గరిష్టస్థాయిలో రోజుకు ఐదువేలకుపైగా రాహుకేతు పూజలు జరిగాయి. మంగళవారం కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం.. అదే సమయంలో మింటులో వెండి నాగపడగలు తయారు చేసే యంత్రానికి స్వల్ప మరమ్మతులు చేపట్టడం జరిగింది. కొద్దిపాటి ఆలస్యమైన మాట వాస్తవం. కానీ సామాజిక మాధ్యమాల్లో నాగపడగల కొరత ఏర్పడినట్లు వైరల్‌ కావడం బాధ కల్గించింది. ఆలయ ప్రతిష్టను మరింత పెంచేందుకు అందరూ సహకరించాలి. 

- అంజూరు శ్రీనివాసులు, పాలకమండలి చైర్మన్‌ 

Updated Date - 2022-07-06T06:48:56+05:30 IST