శిథిలావస్థలో ఎస్సీ బాలికల హాస్టల్ భవనం
ABN , First Publish Date - 2022-10-05T05:10:35+05:30 IST
శిథిలావస్థలో ఎస్సీ బాలికల హాస్టల్ భవనం
- మరమ్మతులు చేయించడం లేదా కొత్త భవనం నిర్మాణంపై పట్టించుకోని పాలకులు
- అరకొర వసతులున్న అద్దె భవనంలో విద్యార్థినుల ఇబ్బందులు
బషీరాబాద్, అక్టోబరు 4: బషీరాబాద్లోని ఎస్సీ బాలికల హాస్టల్ శిథిలావస్థకు చేరింది. ఈ భవనాన్ని 2021 నవంబర్ నెలలో ఖాళీ చేసి స్థానికంగా ఓ ఆద్దె భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి ఈ సొంత భవనాన్ని పట్టించుకునేవారు కరువవడంతో నిరుపయోగంగా మారింది. విద్యార్థులకు సొంత భవనంలో ఉన్నన్ని వసతులు అద్దె భవనంలో లేవు. ఇది పెద్దగా ఉంది. భవనం పాతబడడంతో శిథిలావస్థకు చేరింది. వర్షాలకు ఉరుస్తోంది. మరి ప్రభుత్వం ఈ భవనం స్థానంలో కొత్తది నిర్మిస్తుందా? లేక ఈ భవనానికే మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తుందా? అనేదా తేలాల్సి ఉంది. ఈ హాస్టల్లో ప్రస్తుతం 62మంది బాలికలు ఉంటున్నారు. విద్యార్థినులకు సొంత హాస్టల్ భవనం అవసరంపై మెట్రిన్ రాధికను వివరణ కోరగా.. ‘భవనం పాతబడి శిథిలావస్థకు చేరింది. వానకాలంలో బాలికలు అక్కడ ఉండలేకపోతున్నారు. ఇదే స్థలంలో కొత్త భవనం నిర్మిస్తే బాలికల ఇబ్బందులు తీరుతాయి. ఇదే విషయమై మేం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.’ అని ఆమె తెలిపారు.