పాతబస్తీలో దళిత బస్తీలను ఖాళీ చేయిస్తున్నారు
ABN , First Publish Date - 2020-05-31T08:56:00+05:30 IST
పాతబస్తీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, వారిని చంపి స్థలాలను కాజేస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు తెలిపారు. దిల్ఖుష్ అతిథి గృహంలో...
బలాల, మంచిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు
బేగంపేట, మే 30 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, వారిని చంపి స్థలాలను కాజేస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు తెలిపారు. దిల్ఖుష్ అతిథి గృహంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో రాములు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాతబస్తీలో దళితులను కొందరు స్థానికులు హత్యలు చేసి వారి స్థలాలను కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో వంద శాతం ఉన్న బస్తీలు ప్రస్తుతం సగానికి తగ్గిపోయాయన్నారు. తీగలకుంట, పార్థీ బస్తీ, గౌలిపురా, సుల్తాన్షాహి, ఫలక్నుమా ప్రాంతాల్లో దళితులను హత్యలతో భయపెట్టి బస్తీలను ఖాళి చేయిస్తున్నారన్నారు. ఆజంపురలోని ఆటస్థలం, సాలార్జంగ్ మ్యూజియం పక్కనున్న ఎస్సీ బస్తీలోని కమ్యూనిటీ హాలును, దారుసలాం పక్కనున్న ఓంనగర్ను కబ్జా చేశారన్నారు. అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని అర్ధరాత్రి పోలీ్సస్టేషన్కు వచ్చి ఎమ్మెల్యే బలాల తీసుకెళ్లాడని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అక్కడి బీజేపీ ప్రజాప్రతినిధి పై అనుచితంగా ప్రవ ర్తించినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి సీపీ రాకుండా కమిషన్ను చులకన చేశారని విమర్శించారు.