రుణ రేట్లు పెంచిన ఎస్బీఐ.. ఈఎంఐలు మరింత భారం
ABN , First Publish Date - 2022-04-20T00:10:53+05:30 IST
ముంబై : అన్ని కాలపరిమితుల రుణ రేట్లను పెంచినట్టు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ప్రకటించింది. ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ ఆన్ లెండింగ్ రేట్)ను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం మేర పెంచినట్టు మంగళవారం ప్రకటించింది.
ముంబై : అన్ని కాలపరిమితుల రుణ రేట్లను పెంచినట్టు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ప్రకటించింది. ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ ఆన్ లెండింగ్ రేట్)ను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం మేర పెంచినట్టు మంగళవారం ప్రకటించింది. తాజా పెంపుతో ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 6.75 శాతానికి చేరింది. ఇదే సమయంలో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.05 శాతానికి చేరిందని బ్యాంక్ వివరించింది. అధిక రుణాలు ఒక ఏడాది ఎంసీఎల్ఆర్కు ముడిపడి ఉంటాయి. సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు ఏప్రిల్ 15 నుంచే ఆచరణలోకి వచ్చిందని ఎస్బీఐ వెబ్సైట్ పేర్కొంది.
రుణ రేట్లు పెరగడంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్లు పొందినవారిపై ఈఎంఐల భారం పెరగనుంది. ఇతర ప్రామాణాల ఆధారంగా రుణాలు తీసుకున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదు. కాగా తాజా సవరణతో ఎంసీఎల్ఆర్ రేటు ఏడాదిలో 7 శాతం నుంచి 7.10 శాతానికి పెరిగినట్టయింది. కాగా ఎస్బీఐ బాటలోనే రానున్న రోజుల వ్యవధిలోనే ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటు 6.65 శాతంగా ఉండగా.. రెపోతో ముడిపడివున్న రుణ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ఈ రేటు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.