ఎస్బీఐ ఎఫ్డీ రేట్ల కోత
ABN , First Publish Date - 2020-05-28T08:51:17+05:30 IST
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ.. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని మరోసారి తగ్గించింది.
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ.. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని మరోసారి తగ్గించింది. ఈసారి 0.40 శాతం వరకు కోత పెట్టింది. బల్క్ డిపాజిట్ల (రూ.2 కోట్లు, అంతకుపైగా)పై వడ్డీరేటును 0.50 శాతం వరకు తగ్గించింది. రేట్ల సవరణ బుధవారం నుంచే అమలులోకి వచ్చింది. ఈనెల 12న ఎస్బీఐ.. మూడేళ్ల కాలపరిమితి గల టర్మ్ డిపాజిట్లపై వడ్డీని 0.20 శాతం తగ్గించింది. మార్చిలోనూ ఎఫ్డీ రేట్లను రెండు సార్లు తగ్గించింది. మార్చి 10న ఒకసారి, 28 నుంచి అమలులోకి వచ్చేలా మరోసారి వడ్డీ రాబడికి కోత పెట్టింది.
గత శుక్రవారం ఆర్బీఐ రెపోరేటును 0.40 శాతం తగ్గించి 4 శాతానికి పరిమితం చేసింది. తదనుగుణంగా రివర్స్ రెపో రేటును సైతం 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గించింది. ఈనేపథ్యంలోనే బ్యాంక్ ఎఫ్డీ రేట్లను మరోసారి తగ్గించినట్లు తెలుస్తోంది.