కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. సౌదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2020-04-09T17:49:24+05:30 IST
సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది.
రియాధ్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు సౌదీలో 2,932 మంది కరోనా బాధితులు ఉండగా, 41 మంది మరణించారు. దీంతో సౌదీ ప్రభుత్వం ఇప్పటికే కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు అనేక చర్యలు తీసుకుంది. ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసింది. స్కూల్స్, మాల్స్, పార్క్స్, మసీదులను మూసివేసింది. తాజాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అన్పెయిడ్ డెబిట్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి తాత్కాలికంగా జైలు శిక్షలను రద్దు చేసింది.
వెంటనే వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే పేరెంట్ చైల్డ్ విజిటేషన్ రైట్స్కి సంబంధించిన తీర్పుల్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రభావం తగ్గే వరకు ఈ నిర్ణయాలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇలా కీలక నిర్ణయాలు తీసుకున్న కింగ్ సల్మాన్కు ఈ సందర్భంగా ఆ దేశ న్యాయశాఖ మంత్రి, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ అధ్యక్షుడు వాలిద్ అల్ సమానీ ధన్యవాదాలు తెలిపారు.