సౌదీలో కోవిడ్ స్వైర విహారం.. 90వేలకు చేరువలో కేసులు..
ABN , First Publish Date - 2020-06-03T18:01:54+05:30 IST
గల్ఫ్ దేశాలను అల్లాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. సౌదీలో స్వైర విహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,869 కొత్త కేసులు నమోదయ్యాయి.
రియాధ్: గల్ఫ్ దేశాలను అల్లాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. సౌదీలో స్వైర విహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,869 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 89,011కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఆరోగ్య సహాయ మంత్రి డాక్టర్ మహ్మద్ అల్ అబ్దులాలి మాట్లాడుతూ కింగ్డమ్లోని నగరాలు, గవర్నరేట్ల పరిధిలో అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు.
మంగళవారం నాటికి దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 22,672 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. వీరిలో 1,264 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా... నిన్న 1,484 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 65,790కి చేరిందని అబ్దులాలి తెలిపారు. మంగళవారం సంభవించిన 24 మరణాలతో కలిపి కోవిడ్ వల్ల మరణించిన వారు 549 మంది అయ్యారు. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితులు 60 లక్షలు దాటిపోగా, మృతుల సంఖ్య 3.82 లక్షలుగా ఉంది.