సౌదీలో శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. 80వేలు దాటిన బాధితులు
ABN , First Publish Date - 2020-05-30T13:52:22+05:30 IST
సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.
రియాధ్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ సౌదీలో పంజా విసురుతున్న కోవిడ్-19 వల్ల ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే సౌదీలో 1,581 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు సౌదీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 81,766కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలియజేసింది. అలాగే నిన్న ఒకేరోజు 2,460 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్న వారు 57,013 మంది అయ్యారు. శుక్రవారం సంభవించిన 17 మరణాలతో కలిపి ఇప్పటివరకూ సౌదీలో 458 మంది ఈ వైరస్కు బలయ్యారు. ఇదిలాఉంటే... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మహమ్మారి 3.66 లక్షల మందిని పొట్టనుబెట్టుకుంది. 60.30 లక్షల మంది బాధితులు ఉన్నారు.