సౌదీలో కరోనా విలయతాండవం.. 2 లక్షలు దాటిన కేసులు
ABN , First Publish Date - 2020-07-04T14:43:16+05:30 IST
సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.
రియాద్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అంతకంతకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు తాజాగా 2 లక్షల మార్కును దాటేశాయి. శుక్రవారం నమోదైన 4,193 కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 201,801కు చేరింది. 1,40,000 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, ఈ మహమ్మారి సౌదీ వ్యాప్తంగా ఇప్పటికే 1,802 మందిని బలిగొంది. ఇక దేశంలో కోవిడ్-19 శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రకు పరిమిత సంఖ్యలో మాత్రమే యాత్రికులను అనుమతించనున్నట్లు సౌదీ సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక హజ్ యాత్ర కోసం మక్కాకు వచ్చిన ప్రతి ఒక్కరిని కోవిడ్ టెస్టు చేసిన తర్వాతే అనుమతించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యూలో ఇటీవల సడలింపులు ఇవ్వడంతోనే తాజాగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.