11 దేశాలపై నిషేధాన్ని ఎత్తేసిన సౌదీ.. భారత్ విషయంలో మాత్రం..
ABN , First Publish Date - 2021-05-30T14:25:27+05:30 IST
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సౌదీ అరేబియా వైరస్ ఉధృతి అధికంగా ఉన్న పలు దేశాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
రియాద్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సౌదీ అరేబియా వైరస్ ఉధృతి అధికంగా ఉన్న పలు దేశాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే, ఇలా బ్యాన్ వేసిన దేశాల్లోంచి తాజాగా 11 దేశాల పౌరులను తమ దేశంలోకి ప్రవేశించడానికి సౌదీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సౌదీ అంతర్గత మంత్రిత్వ శనివారం కీలక ప్రకటన చేసింది. ఆదివారం నుంచి ఈ దేశాల పౌరులు సౌదీకి రావొచ్చని ప్రకటించింది. కానీ, క్వారంటైన్ నిబంధన మాత్రం పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. సౌదీ బ్యాన్ తొలగించిన దేశాల జాబితాలో యూఏఈ, జర్మనీ, అమెరికా, ఐర్లాండ్, ఇటలీ, బ్రిటన్, స్వీడన్, స్వీట్జర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి. కాగా, ఈజిప్ట్, టర్కీ, లెబనాన్, భారత్, అర్జెంటీనా, ఇండోనేషియా, పాకిస్తాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల పౌరులపై నిషేధం యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కనుక భారత పౌరులు సౌదీ వెళ్లేందుకు ఇంకా కొన్నాళ్లు వేచి చూడకతప్పని పరిస్థితి.