సౌదీ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా.. శనివారం ఒకేరోజు ఎంతమందిని ఉరి తీసిందంటే..!
ABN , First Publish Date - 2022-03-13T14:01:18+05:30 IST
సౌదీ అరేబియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఒకేరోజు భారీ సంఖ్యలో సామూహిక మరణ శిక్షను అమలు చేసింది. శనివారం నాడు ఒకేరోజు 81 మందిని ఉరితీసింది. తీవ్రవాదంతో పాటు ఇతర నేరాల కింద శిక్ష పడిన 81 మందిని ఇలా ఒకేరోజు మరణ శిక్షను విధించింది. కింగ్డమ్ ఆధునిక చరిత్రలో నిర్వహించబడిన అతిపెద్ద సామూహిక ఉరిశిక్ష ఇదేనని..
రియాద్: సౌదీ అరేబియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఒకేరోజు భారీ సంఖ్యలో సామూహిక మరణ శిక్షను అమలు చేసింది. శనివారం నాడు ఒకేరోజు 81 మందిని ఉరితీసింది. తీవ్రవాదంతో పాటు ఇతర నేరాల కింద శిక్ష పడిన 81 మందిని ఇలా ఒకేరోజు మరణ శిక్షను విధించింది. కింగ్డమ్ ఆధునిక చరిత్రలో నిర్వహించబడిన అతిపెద్ద సామూహిక ఉరిశిక్ష ఇదేనని సౌదీ ప్రెస్ ఏజెన్సీ(ఎస్పీఏ) పేర్కొంది. 1979లో మక్కాలోని గ్రాండ్ మసీదును స్వాధీనం చేసుకున్నందుకు దోషులుగా తేలిన 63 మంది మిలిటెంట్లకు 1980 జనవరిలో సామూహిక మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఇది ఆ సంఖ్యను కూడా మించిపోయింది. ఉరి తీయబడిన 81 మందిలో ఏడుగురు యెమెన్ జాతీయులు, ఒకరు సిరియన్ కాగా మిగతా 73 మంది సౌదీ పౌరులు అని ఎస్పీఏ వెల్లడించింది.
అయితే, ఉరిశిక్షల కోసం సౌదీ శనివారాన్ని ఎందుకు ఎంచుకుంటుందో స్పష్టంగా తెలియలేదు. ఇక 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 67 మందికి మరణ శిక్ష అమలు చేయగా, 2020లో 27 మందిని ఉరి తీసింది. కింగ్డమ్లో చివరి సామూహిక ఉరి 2016 జనవరిలో జరిగింది. అప్పుడు ఒకేసారి 47 మంది వ్యక్తులను ఉరితీసింది. ఇదిలాఉంటే.. కరోనావైరస్ మహమ్మారి సమయంలో సౌదీ అరేబియాలో మరణశిక్ష కేసుల సంఖ్య తగ్గింది. తాజాగా ఉరి శిక్ష అమలు చేసిన వారిలో చాలా మంది "అమాయక పురుషులు, మహిళలు, పిల్లలను హత్య చేయడంతో సహా వివిధ నేరాలకు పాల్పడినవారు" ఉన్నట్లు ఎస్పీఏ వెల్లడించింది. అలాగే ఉరితీయబడిన వారిలో కొందరు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మద్దతుదారులు కూడా ఉన్నట్లు సౌదీ తెలిపింది. కాగా, నిన్నటి ఉరిశిక్షలు వెంటనే అంతర్జాతీయ విమర్శలకు దారితీశాయి.