రియాద్: విదేశీయులకు దేశ పౌరసత్వం ఇచ్చే విషయమై తాజాగా సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రఖ్యాత వ్యక్తులు, వివిధ రంగాల్లోని నిష్ణాతులు, అసాధారణమైన ప్రపంచ ప్రతిభావంతులకు సౌదీ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. మత, వైద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, క్రీడలు, సాంకేతిక రంగాల్లో నిపుణులు, అసాధారణమైన ప్రపంచ ప్రతిభావంతులకు సౌదీ పౌరసత్వం మంజూరు చేయాలని జారీ చేసిన రాయల్ డిక్రీకి అనుగుణంగా ఈ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం కింగ్డమ్ అంతటా వివిధ రంగాల అభివృద్ధికి దోహదపడుతుందనేది సౌదీ అభిప్రాయం.
అలాగే విజన్ 2030 లక్ష్యానికి కొత్త ఇన్నోవేషన్స్లో సౌదీ అరేబియా పాత్ర కీలకంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే వరల్డ్వైడ్గా ప్రముఖ వ్యక్తుల సహకారం పొందాలనే ఉద్దేశంతో వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలనేది సౌదీ అరేబియా మాస్టర్ప్లాన్. ఇక 2016లో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030ని ప్రకటించారు. ఇది సౌదీ ఆర్థిక వ్యవస్థను సాంప్రదాయ చమురు వనరుల నుండి వైవిధ్యపరచడానికి ఉద్దేశించిన ఆర్థిక ప్రణాళిక.