Covid-19: వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు సౌదీ శుభవార్త

ABN , First Publish Date - 2021-07-22T17:22:58+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది.

Covid-19: వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు సౌదీ శుభవార్త

రియాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది. ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ మేరకు బుధవారం సౌదీ పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ కీలక ప్రకటన చేసింది. దీని కోసం ప్రవాసులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేగాక ఈ పొడిగించిన గడువు కింగ్డమ్ బయట ఉన్న ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసాలకు ఆటోమెటిక్‌గా వర్తిస్తుందని తెలిపింది.


ప్రవాసులు పాస్‌పోర్టుల కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా జాతీయ సమాచార కేంద్రం సహకారంతో ఈ పొడిగింపును ఎలక్ట్రానిక్‌గా వర్తింప చేయడం జరుగుతుందని డైరెక్టరేట్ సూచించింది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ బుధవారం మీడియాతో చెప్పింది. ఆగస్టు 31 వరకు యూఏఈలో ప్రవేశంలేని దేశాలకు చెందిన ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్స్‌తో పాటు ఎగ్జిట్, రీఎంట్రీ వీసాలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. అలాగే ఇవే దేశాలకు చెందిన సందర్శకుల విజిట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుందని పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది.   

Updated Date - 2021-07-22T17:22:58+05:30 IST